భోపాల్, నవంబర్ 5: ఒకటో తరగతి చదువుకొనే ఆ దళిత బాలికకు ఓటు హక్కు లేదు.. ఆ వయసుకు ఉండదు కూడా! అయితే సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేసిన తన వదినకు పాప తండ్రి, వారు నివసించే ప్రాంతం వారు ఓటేయలేదన్న అక్కసుతో బాలికను ఓ పాఠశాల డైరెక్టర్ బడి నుంచి బహిష్కరించారు. ‘టీసీ కూడా తీసుకుపోండి’ అంటూ బాధిత తల్లిదండ్రులకు హుకుం జారీచేశారు. ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్లోని శాజాపూర్ జిల్లాలో జరిగింది. దుపారా గ్రామ పంచాయతీకి ఈ ఏడాది జూలైలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో స్కూల్ డైరెక్టర్ రవి పాటీదార్ వదిన సప్నా పాటీదార్ సర్పంచ్ (బీజేపీ మద్దతు) అభ్యర్థిగా పోటీచేశారు. అదే గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని ఆకాంక్ష ఒకటో తరగతి చదువుతున్నది. ఎన్నికల్లో సప్నా గెలిచినప్పటికీ ఆకాంక్ష తండ్రి రాజేశ్ చవ్రే, వారు నివసించే ప్రాంతం వారు ఓటేయలేదని కక్ష పెంచుకొన్న రవి.. బాలికను పాఠశాలకు రానివ్వకుండా ఆపేశాడు. బాధిత కుటుంబం దీనిపై అడగ్గా.. ‘మాకు మీరు ఓటేయలేదు.. మీ పాపకు మా స్కూల్లో చదువు చెప్పం, టీసీ కూడా తీసుకుపోండి’ అని తెలిపాడు. ఘటనపై బాధిత తండ్రి కొన్ని రోజులుగా జిల్లా విద్యాశాఖాధికారితో పాటు సీఎం హెల్ప్లైన్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవటం గమనార్హం.