మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ఆదిలోనే అవాంతరాలు ఎదురయ్యాయి. చరణ్, శంకర్ కాంబినేషన్లో సినిమా అని అధికారిక ప్రకటన రావడం .. ట్రిపుల్ ఆర్ షూటింగ్ అయిపోయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుందని వార్తలు వెలువడటం అన్ని చకచక అయిపోయాయి. రామ్ చరణ్ నుంచి మరో పాన్ ఇండియన్ మూవీ రాబోతోందని ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్కు నిరాశ తప్పేలా లేదు. దర్శకుడు శంకర్పై లైకా ప్రొడక్షన్స్.. కోర్టుకెక్కడంతో చరణ్ సినిమా ఆగిపోయేలా కనిపిస్తోంది.
కెరీర్లో తొలిసారి తెలుగు హీరోతో సినిమా చేయబోతున్నాడు శంకర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఈయన పాన్ ఇండియన్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్తో ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడు. పూర్తిగా పొలిటికల్ థ్రిల్లర్గా ఈ చిత్రం ఉండబోతుందనే వార్తలు వచ్చాయి. ఒకే ఒక్కడు సినిమాకు ఇది సీక్వెల్ అని కూడా ప్రచారం జరుగుతుంది. విజువల్ ఎఫెక్ట్స్ జోలికి పోకుండా కేవలం కథా ప్రధానంగా సాగేలా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు శంకర్.
ట్రిపుల్ ఆర్ షూటింగ్ పూర్తైన తర్వాత రామ్ చరణ్ సినిమాను పట్టాలెక్కించాలని ఈయన ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకు ఊహించని చిక్కులు ఎదురయ్యాయి. తమ సినిమాను పూర్తి చేయకుండా మరో సినిమాకు శంకర్ కమిట్ అయ్యాడు అంటూ ఈయనపై లైకా ప్రొడక్షన్స్ కోర్టుకెక్కింది.
అసలు విషయం ఏంటంటే ఈయన లాక్ డౌన్కు ముందు ఇండియన్ -2 సినిమాకు కమిటయ్యాడు. ఈ సినిమాను మొదలు పెట్టడమే కాకుండా కొంతభాగం షూటింగ్ కూడా చేశాడు. మధ్యలో ఘోర ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోయారు కూడా. ఈ సినిమా కోసం లైకా ప్రొడక్షన్స్ భారీగానే ఖర్చు చేసింది. అయితే ఉన్నపలంగా ఈ సినిమాను ఆపేశాడు శంకర్. గతంలో శంకర్ ఇదే నిర్మాణంలో 2.0 సినిమా చేశాడు. అయితే ఇది దారుణంగా ఫ్లాప్ అయింది. దాంతో ఇండియన్ 2 సినిమాకు సగానికి సగం బడ్జెట్ కోత పెట్టారు నిర్మాతలు.
ఇది నచ్చని శంకర్ ఇండియన్ 2 పక్కన బెట్టి రామ్ చరణ్ సినిమాకు కమిటయ్యాడు. దాంతో లైకా నిర్మాతలు మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు.
ఇప్పటికే కమల్ హాసన్ ‘ఇండియన్-2’ సినిమా కోసం తాము రూ.180 కోట్లు ఖర్చు చేశామని.. దర్శకుడు శంకర్ కు ఇస్తామన్న రూ.40 కోట్ల పారితోషికంలో రూ.14 కోట్లు ఇచ్చేశామని చెప్పారు. మిగిలిన మొత్తం కోర్టులో డిపాజిట్ చేస్తామని తెలిపారు. శంకర్ను తమ సినిమా పూర్తి చేయకుండా మరో సినిమాకు వెళ్లకుండా ఆపాలని పిటిషన్ వేసింది.
కానీ మద్రాస్ కోర్టు మాత్రం దీనిపై ఇప్పటి వరకు నోరు మెదపలేదు. ఈ విషయంలో దర్శకుడు శంకర్ వాదన కూడా విన్న తర్వాతే తీర్పు ఇస్తామని తెలిపింది. శంకర్ తమ వాదన వినిపించాలని నోటీసులు పంపింది. శంకర్ వాదనలతో న్యాయస్థానం సంతృప్తి చెందితే ఓకే కానీ లేదంటే మాత్రం రామ్ చరణ్-శంకర్ సినిమాకు ఊహించని తిప్పలు ఎదురవ్వడం ఖాయం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి