Congress MLA : అత్యాచారం చేస్తే పుణ్యం దక్కుతుందని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని భండేర్ (Bhander) కాంగ్రెస్ శాసనసభ్యుడు (Congress MLA) పూల్ సింగ్ బరయ్య (Pool Singh Baraiah) మహిళలను కించపర్చే విధంగా మాట్లాడాడు. అత్యాచారాలకు కులాన్ని, వర్గాన్ని అంటగడుతూ నోరు పారేసుకున్నాడు.
ఈ సమాజంలో కొన్ని కులాలు, వర్గాల మహిళలపై లైంగిక దాడి జరుగుతోందని, వారితో లైంగిక వాంఛ తీర్చుకుంటే తీర్థయాత్రలకు వెళ్లిన పుణ్యం దక్కుతుందనే నమ్మకంతోనే ఇలా చేస్తున్నారని, ఈ విషయం పుస్తకాల్లో కూడా ఉందని వ్యాఖ్యానించాడు. అందమైన అమ్మాయి కనిపిస్తే పురుషుడి మనస్సు చలించి అత్యాచారానికి పాల్పడే అవకాశం ఉందని అన్నాడు.
కొన్ని వర్గాల మహిళలు మాత్రం అందంగా ఉండరని, కానీ ఆ వర్గాలకు చెందిన మహిళలతో కలిస్తే ఏదో లాభం ఉంటుందని ఆశించి అత్యాచారాలు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే హీనంగా మాట్లాడారు. రోడ్డుపై నడుస్తుంటే అందమైన అమ్మాయిని చూస్తే అది అతడి మనసును మరల్చి, అత్యాచారానికి ప్రేరేపిస్తుందని వ్యాఖ్యానించాడు.
అయితే ఎమ్మెల్యే పూల్ సింగ్ వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ, వివిధ కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సిద్ధాంతం ఇదేనా..? అని బీజేపీ ప్రశ్నించింది. ఆయన ఎలాంటి నీచబుద్ధితో ఉన్నారో ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని ఆల్ ఇండియా బ్రాహ్మణ పరిషత్ నేత పండిత్ పుష్పేంద్ర మిశ్రా ఆగ్రహం వ్యక్తంచేశారు.
పూల్ సింగ్ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారి కూడా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి పూల్సింగ్ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అత్యాచారాన్ని ఏవిధంగానూ సమర్థించలేమని చెప్పారు. అత్యాచారంచేసే వ్యక్తి ఎవరైనా కులం, మతంతో సంబంధం లేకుండా నేరస్థుడేనని స్పష్టం చేశారు.