CAA Act | కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన చట్టంపై ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఎన్నికలు రాగానే సీఏఏ నిబంధనలు వస్తాయని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టంపై తమకు అభ్యంతరాలున్నాయని ఆయన పేర్కొన్నారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని కేంద్రానికి సూచించారు. సీఏఏ నిబంధనలను ఐదేళ్లుగా ఎందుకు పెండింగ్లో పెట్టారని ప్రశ్నించారు. సీఏఏ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లింలే లక్ష్యంగా సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ తెచ్చారని ఆయన ఆరోపించారు.
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం అమలుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఏఏ అమలుతో డిసెంబర్ 31, 2014 లేదా అంతుకు ముందు పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్లోకి వచ్చిన హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు పౌరసత్వం లభించనున్నది.
ఐదేళ్ల పాటు నివాసం ఉన్న.. ఆరు కమ్యూనిటీలకు మాత్రమే పౌరసత్వం జారీకి మార్గం సుగమం కానున్నది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2019లో సీఏఏ చట్టానికి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో చట్టం అమలులోకి రాలేదు. చట్టం అమలుకు సంబంధించి నియమకాలు రూపొందించకపోవడంతో అమలులోకి రాలేదు. తాజాగా కేంద్రం విధివిధానాలను రూపొందిస్తూ నోటిఫై చేసింది. దాంతో పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వచ్చింది.