ముంబై: మహారాష్ట్రలో సినిమాల్లోని యాక్షన్ సీన్లను తలదన్నేలా దారిదోపిడీ జరిగింది. ఓ కారు ముందు వెళ్తుండగా.. మరో రెండు కార్లు, రెండు బైకులపై దొంగలు ఆ కారును వెంబడిస్తున్నారు. బైకులపై ఉన్న దుండగులు ముందు వెళ్తున్న కారుపై కాల్పులు జరుపుతున్నారు. దొంగలు వెంబడిస్తున్నారన్న భయంతో ముందున్న వ్యక్తులు కారును మరింత వేగంగా నడుపుతున్నారు.
ఇలా కొన్ని కిలోమీటర్ల వరకు సినీ ఫక్కీలో చేజింగ్ కొనసాగింది. చివరికి దొంగలు ముందు వెళ్తున్న కారును దొరకబట్టి చుట్టుముట్టారు. కారులో ఉన్న వ్యక్తులను తీవ్రంగా కొట్టి అందులోని రూ.3.60 కోట్ల నగదు తీసుకుని పారిపోయారు. మహారాష్ట్రలోని పుణె-షోలాపూర్ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు ఈ దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
బాధితులు భవేశ్కుమార్ పటేల్, విజయ్ భాయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే నిందితులు అంత భారీ మొత్తంలో నగదును ఎక్కడి తరలిస్తున్నారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లూటీ అయిన కోట్ల రూపాయల నగదు హవాలా సొమ్మేమోనని అనుమానిస్తున్నారు.