కోల్కతా : మదర్ థెరిస్సా ఛారిటీ బ్యాంక్ అకౌంట్లను కేంద్ర ప్రభుత్వం సీజ్ చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ గ్రూపు ప్రతినిధి సునీతా కుమార్ స్పందించారు. ఛారిటీ బ్యాంకు లావాదేవీలు యధావిధిగా సాగుతున్నాయని, బ్యాంకు ఖాతాల స్తంభనపై కేంద్రం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అంతా సజావుగా సాగుతోందని స్పష్టం చేశారు.
బ్యాంక్ ఖాతాల సీజ్ విషయం తనకు తెలియదని ఆమె చెప్పుకొచ్చారు. మదర్ థెరిస్సా ఛారిటీ బ్యాంక్ అకౌంట్లను కేంద్రం సీజ్ చేసిందని దీంతో ఛారిటీకి చెందిన 22,000 మంది రోగులు, ఉద్యోగులు ఆహారం, మందులు లేక ఇబ్బందిపడుతున్నారని మమతా బెనర్జీ సోమవారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు.
చట్టం అత్యున్నతమైనదే అయినా మానవత్వంతో కూడిన కార్యకలాపాలకు అడ్డుపడరాదని దీదీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. క్రిస్మస్ రోజున మదర్ ధెరిస్సా ఛారిటీ బ్యాంకు ఖాతాలను కేంద్రం సీజ్ చేయడం తనను షాక్కు గురిచేసిందని ఆమె అన్నారు.