జైసల్మేర్: రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ జిల్లాలో ఘోరం జరిగింది. మోర్టార్లను (ఫిరంగులు) పేల్చడంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్న ఓ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ ప్రమాదవశాత్తు ఫిరంగి పేలి ప్రాణాలు కోల్పోయాడు. ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీఎస్ఎఫ్లోని 136 బెటాలియన్కు చెందిన జవాన్లు ఆదివారం ఉదయం జైసల్మేర్లో మోర్టార్లు పేల్చడంలో శిక్షణ తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఓ ఫిరంగి పేలి ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ జవాన్ను చికిత్స కోసం రామ్గఢ్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మరణించిన జవాన్ పేరు సందీప్సింగ్ అని అధికారులు చెప్పారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు, బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.