చెన్నై : తమిళనాడులోని కూనూర్లో భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17వీ5 హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనలో మరణించిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధూలిక రావత్ అవశేషాలను గురువారం ఢిల్లీకి తరలించనున్నారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మరణం తీవ్ర దిగ్ర్భాంతి కలిగించింది. రావత్ మృతిపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
కోయంబత్తూర్ నుంచి వెల్లింగ్టన్ వెళుతుండగా హెలికాఫ్టర్ కుప్పకూలడంతో 13 మంది ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రస్తుతం వెల్లింగ్టన్లోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఐఏఎఫ్ పేర్కొంది. సీడీఎస్ బిపిన్ రావత్ మృతి, హెలికాఫ్టర్ ప్రమాదంపై ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశమైంది. హెలికాప్టర్ ప్రమాద ఘటనపై రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ రేపు పార్లమెంట్లో ప్రకటన చేయనున్నారు.