Cyber Attack | దేశంలో మంగళవారం భారీ సైబర్ దాడి జరిగింది. 500పైగా వెబ్సైట్ హ్యాకింగ్ బారినపడ్డాయి. ఇందులో మహారాష్ట్ర థానే పోలీసుల వెబ్సైట్తో సహా 70 ప్రభుత్వ సైట్లు ఉన్నట్లుగా సమాచారం. అయితే, మలేషియా, ఇండోనేషియాకు చెందిన హ్యాకర్లే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పలు వెబ్సైట్ను పునరుద్ధరించినట్లు మహారాష్ట్ర సైబర్ సెల్ ఏడీజీ మధుకర్ పాండే తెలిపారు.
ఇంకా వెబ్సైట్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, రాష్ట్రంలో 70కిపైగా వెబ్సైట్లపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. 500 కంటే ఎక్కువ వెబ్సైట్లు హ్యాకింగ్కు గురయ్యాయని పేర్కొన్నారు. మత ఘర్షణల నేపథ్యంలోనే పలువురు సైబర్ హ్యాకర్లు కలిసి ఈ దాడికి పాల్పడ్డట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో మలేషియా, ఇండోనేషియా హ్యాకర్ల హస్తం ఉన్నట్లుగా సమాచారం ఉందని ఏడీజీ పాండే తెలిపారు. ఈ ముఠా భారత్లో యాక్టివ్గా ఉందా? లేదా? అనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
మంగళవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో పోలీస్ వెబ్సైట్ను హ్యాక్ చేసినట్లు థానే పోలీస్ సైబర్ సెల్ డీసీపీ సునీల్ లోఖండే తెలిపారు. ఆ తర్వాత సాంకేతిక నిపుణులు వెబ్సైట్ను పునరుద్ధరించారు. సైబర్ దాడిపై ప్రభుత్వ వెబ్సైట్లు, హ్యాకింగ్లపై విచారణ జరపాలని మహారాష్ట్ర హోం శాఖ రాష్ట్ర సైబర్ సెల్ను ఆదేశించింది. థానే పోలీస్ వెబ్సైట్ హ్యాకింగ్పై కూడా విచారణ ప్రారంభించారు. సోమవారం సైతం దేశానికి చెందిన పలు విద్యా సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలకు చెందిన వెబ్సైట్లు సైతం హ్యాకింగ్కు గురయ్యాయి.