Survey | దేశం వీడుదాం.. విదేశాలకెళ్లి స్థిరపడిపోదాం..! చాలా మంది భారతీయులు ఇదే ఆలోచనతో ఉన్నారు. వచ్చే రెండేండ్లలో వేరే దేశానికి వెళ్లి సెటిల్ అవుదామనుకొంటున్నవారు 17% మంది ఉన్నారని తాజా సర్వేలో తేలింది. గత రెండేండ్లలో 16% మంది వీడినట్టు వెల్లడైంది.
రెంట్లు, హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ అంటే తలకు మించిన భారం.. సిటీలో ఉండాలంటే ఓ ఇల్లు ఉండాలి.. వచ్చే రెండేండ్లలో ఓ ఇల్లు కొంటే సరి. ఇదీ! యువ జంటల ఆలోచన. దేశంలో 44 శాతం మంది ఆలోచన ఇలా ఉన్నదని తాజా సర్వేలో వెల్లడైంది.
సీబీఆర్ఈ సౌత్ఏషియా అనే రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ దాదాపు 20,000 మందిని సర్వే చేసి ఈ వివరాలను ప్రకటించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: దేశాన్ని వీడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. విదేశాల్లో స్థిరపడేందుకు ఎక్కువ మంది భారతీయులు మొగ్గు చూపుతున్నారు. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ దక్షిణాసియా దాదాపు 20,000 మందిని సర్వే చేయగా, వచ్చే రెండేండ్లలో వేరే దేశానికి వెళ్లిపోదామనుకొనేవాళ్లు 17 శాతం మంది ఉన్నట్టు తేలింది. సర్వేలోని విశేషాలను ‘వాయిస్ ఫ్రమ్ ఇండియా: హౌ విల్ పీపుల్ లివ్, వర్క్ అండ్ షాప్ ఇన్ ది ఫ్యూచర్’ పేరుతో నివేదికను ఈ సంస్థ విడుదల చేసింది. నివేదిక ప్రకారం.. గత రెండేండ్లలో 16 శాతం మంది వేరే దేశానికి వెళ్లి సెటిల్ అయ్యారు. అలాగే, కొత్త ఇంట్లోకి వెళ్లే వారు కూడా పెరుగుతున్నారు. అందుకోసం 44 శాతం మంది 20-26 ఏండ్ల వయస్కులు (జనరేషన్ జెడ్) ప్లాన్ చేసుకొంటున్నారు. పాలసీల్లో పెను మార్పులు, స్టాంప్ డ్యూటీ ఎత్తివేత, తక్కువ గృహరుణాల వడ్డీ రేట్లు, డెవలపర్లు ఇస్తున్న డిస్కౌంట్లు, స్కీంల వల్ల భారత రెసిడెన్షియల్ రంగం భారీ వృద్ధి సాధిస్తున్నది. ఇది ఇల్లు కొనాలనుకొనేవారిని ఆకర్షిస్తున్నదని, కరోనా తర్వాత పరిణామాలు కూడా కొత్తిల్లు కొనేలా చేస్తున్నదని సర్వే వెల్లడించింది.
ఇంటి నాణ్యత 86%
ప్రాపర్టీ స్థిరత్వం 76%
రవాణా సౌకర్యం 75%
ప్రాపర్టీ ధర 75%
వర్క్ ఫ్రం హోమ్కు స్పేస్ 76%
ఇంటి నుంచి ఆఫీస్కు రవాణా సమయం 71 %
ఇంటి ఆవరణలో స్థలం 70 %
ఫిట్నెస్, స్పోర్ట్స్ సౌకర్యాలు 70 %
స్మార్ట్ హోమ్ టెక్నాలజీ 67 %
పార్సిల్/ఫుడ్ డెలివరీ సదుపాయం 64%
రిటైల్ సదుపాయాలు 64%
అద్దెలు 59 %