న్యూఢిల్లీ: భారత్, చైనా సైనికుల మధ్య సరిహద్దులో మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. హిమాలయ ప్రాంతంలోని లడఖ్ వద్ద భద్రతకు సంబంధించిన ఒక నివేదిక ఈ మేరకు పేర్కొంది. ఈ ప్రాంతంలో సైనికపరమైన మౌలిక సదుపాయాలను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) పెంచుతుండటం ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలకు దారితీయవచ్చని అంచనా వేసింది.
సరిహద్దు ప్రాంతాల్లో స్థానిక పోలీసులు సేకరించిన నిఘా సమాచారం, భారత్-చైనా మధ్య గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఘర్షణల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ‘ఘర్షణలు, ఉద్రిక్తతల నమూనాను విశ్లేషిస్తే, 2013-14 నుంచి ప్రతి రెండు మూడేళ్లకు ఉద్రిక్తతల తీవ్రత పెరుగుతున్నది. ఇరు దేశాలు పోటాపోటీగా సైనిక మౌలిక నిర్మాణాలు చేపట్టడంతోపాటు బలగాలను పెంచుకుని బలాబలాలను పరీక్షించుకుంటున్నాయి’ అని అందులో పేర్కొన్నారు.
అలాగే చైనా బఫర్ జోన్లను ఏర్పాటు చేయడం ద్వారా సరిహద్దును భారత భూభాగంలోకి నెట్టుతోందని, దీని వల్ల లడఖ్ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని భారత్ క్రమంగా కోల్పోతోందని ఆ నివేదిక వెల్లడించింది. దీనికి అడ్డుకట్టవేసేందుకు సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, సరిహద్దు పర్యాటకాన్ని పెంపొందించాలని సూచించింది.
ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగిన అత్యున్నత పోలీసు అధికారుల సమావేశంలో ఈ రహస్య నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరైన ఈ సమావేశంలో సమర్పించిన ఈ నివేదిక అంచనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పేర్కొంది. అయితే ఈ నివేదికపై భారత్, చైనా రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఇప్పటి వరకు స్పందించలేదు.