న్యూఢిల్లీ: హర్యానాలోని నుహ్ జిల్లాలో జరిగిన మత ఘర్షణలు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో స్థానిక రైతు సంఘాలు, కాప్ పంచాయతీలు ఓ డిమాండ్ చేశాయి. భజరంగ్ దళ్ నేత మోనూ మనేసర్(Monu Manesar)ను అరెస్టు చేయాలని కోరాయి. ముస్లింలు మెజారిటీగా ఉండే నుహ్ జిల్లాలో జూలై 31వ తేదీన జరిగిన హింసలో ఆరు మంది మృతిచెందారు. విశ్వహిందూ పరిషత్ ర్యాలీపై ఓ గ్యాంగ్ అటాక్ చేసింది. మరణించిన వారిలో ఇద్దరు హోంగార్డులు ఉన్నారు.
ఈ ఏడాది ఆరంభంలో ఇద్దరు ముస్లింల హత్య జరిగింది. ఆ కేసులో మనేసర్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. నుహ్ జిల్లాలో జరగనున్న ర్యాలీలో అతను పాల్గొంటాడని సమాచారం రావడంతో అక్కడ భారీ ఎత్తున హింస చోటుచేసుకున్నది. నుహ్ హింసపై ఇప్పటికే 113 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. 305 మందిని అరెస్టు చేశారు. కస్టడీలో ఉన్న మరో 106 మందిని విచారిస్తున్నారు.
నుహ్ హింసను రైతు సంఘాలు ఖండించాయి. శాంతి, సామరస్యాన్ని స్థాపించాలని తీర్మానం చేశాయి.భారతీయ కిసాన్ మజ్దూర్ యూనియన్ ఆర్గనైజ్ చేసిన కార్యక్రమంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు పాల్గొన్నారు.