కోల్కతా: దుర్గా పూజా వేడుకలకు పశ్చిమ బెంగాల్ సన్నద్ధమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా అంత సందడిగా ఇవి జరుగలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఘనంగా జరుపుతామని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి నెల రోజుల పాటు దుర్గా పూజ వేడుకలను నిర్వహిస్తామని సోమవారం అన్నారు. ప్రారంభం రోజైన సెప్టెంబర్ 1న కోల్కతాలో భారీ ర్యాలీ జరుగుతుందని చెప్పారు. దుర్గా పూజకు వారసత్వ ట్యాగ్ని అందించిన యునెస్కో (UNCESO)కి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని రంగుల మయం చేయాలని, వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని పూజా కమిటీలు, ప్రజలకు పిలుపునిచ్చారు. యునెస్కో సభ్యులతోపాటు విదేశీ ప్రతినిధుల బృందాలు కూడా కోల్కతాను సందర్శిస్తాయని అన్నారు. భారీ ర్యాలీతో ప్రారంభమయ్యే దుర్గా పూజా కార్యక్రమాలు అక్టోబర్ 8న మెగా కార్నివాల్తో ముగుస్తాయని వివరించారు.
మరోవైపు దుర్గా పూజా కమిటీలకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.50,000 నుంచి రూ.60,000కు పెంచుతున్నట్లు సీఎం మమత తెలిపారు. పన్నులు రద్దు చేయడంతోపాటు విద్యుత్ బిల్లులపై రాయితీని 50 శాతం నుంచి 60 శాతానికి పెంచినట్లు వెల్లడించారు. అలాగే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రభుత్వ సెలవు రోజులుగా ప్రకటించారు.