Monsoon : ఎల్నినో ప్రభావంతో దేశంలో రుతుపవనాలు (Monsoon) సరిగా విస్తరించక వానలు కరువయ్యాయి. వానలు లేక ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు చెప్పింది. ఇన్నాళ్లు మందగించిన నైరుతి రుతుపవనాలు (Soutwest Monsoon) ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్లీ పుంజుకోనున్నాయని తెలిపింది. బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడుతున్న ఒక బలమైన అల్పపీడన ద్రోణి కారణంగా రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెప్పారు.
ఈ తాజా అల్పపీడన ప్రభావంతో జూలై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ప్రధానంగా మధ్య భారత్, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా), తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. వ్యవసాయ పనులకు ఈ వర్షాల పునరాగమనం ఎంతో కీలకం కానున్నది. వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతులకు ఈ వార్త పెద్ద ఊరటనిస్తోంది.
ఈ అల్పపీడన వ్యవస్థ పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే కొద్దీ దేశంలోని అంతర్గత ప్రాంతాలలో మేఘాలు దట్టంగా అలముకుని, రాబోయే వారం రోజుల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాబోయే 48 గంటల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.