పరీక్షల కోసం ఐదేండ్ల బాలిక నమూనాలు
న్యూఢిల్లీ, జూన్ 4: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో మంకీపాక్స్ కలకలం రేగింది. ఐదేండ్ల బాలిక నమూనాలను మంకీపాక్స్ పరీక్ష కోసం పంపారు. దీంతో ఆ పాపకు మంకీపాక్స్ సోకిందన్న ప్రచారం జరిగింది. అయితే ఇదంతా అబద్ధమని, ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు రేకెత్తించొద్దని వైద్యాధికారులు చెబుతున్నారు.
‘ఐదేండ్ల పాపకు దురద, దద్దుర్లు వస్తున్నట్టు తెలియడంతో ముందస్తు జాగ్రత్తగా మంకీపాక్స్ పరీక్షల కోసం నమూనాలను పంపాం. ఆ పాపకు మరే ఆరోగ్య సమస్యలు లేవు. విదేశాలకు వెళ్లి వచ్చిన వారితో ఆ పాప కానీ, కుటుంబసభ్యులు కానీ కలవలేదు. భయపడాల్సిన అవసరం లేదు’ అని ఘజియాబాద్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ తెలిపారు.