న్యూఢిల్లీ: పరిపాలనపై దృష్టి సారించాలని, తరచుగా తనతో సమావేశం కావాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా రాసిన లేఖపై ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ ఘాటుగా బదులిచ్చారు. ప్రధాని మోదీ, బీజేపీ సీఎంలు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, పుష్కర్ ధామి, కేంద్ర మంత్రులు, బీజేపీ ఇతర నేతల మాదిరిగా తాను కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నట్లు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ పార్టీ అని, జాతీయ కన్వీనర్గా గుజరాత్, ఢిల్లీ ఎంసీడీ ఎన్నికలతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు చెప్పారు.
కాగా, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో గెలిచిన ఆప్, అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించింది. ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నిక ముందు పది మంది ఆల్డర్మెన్లను ఎల్జీ నామినేట్ చేయడంతో బీజేపీ, ఆప్ సభ్యుల మధ్య గొడవ జరిగింది. అయితే ఆల్డర్మెన్లను ఎల్జీ నామినేట్ చేయడన్ని సీఎం కేజ్రీవాల్ తప్పుపట్టారు. నామినేషన్ ప్రక్రియను బైపాస్ చేసిన ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు.
అలాగే ఆ ఉత్తర్వులో ‘అడ్మినిస్ట్రేటర్/ఎల్జీ’ అని పేర్కొనడంపై వీకే సక్సేనా వివరణను కేజ్రీవాల్ కోరారు. ప్రతి శాఖల అధికారులతో ఎల్జీ నేరుగా వ్యవహరిస్తారా? ఆయా విభాగాలను నేరుగా నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు. ఒకవేళ అలా జరిగితే ఎన్నికైన తమ ప్రభుత్వం మీతో టీ తాగుతూ వ్యక్తిగతంగా వాటిని చర్చించాలా? అని నిలదీశారు. ఢిల్లీతోపాటు దేశానికి ఈ ప్రశ్నలు చాలా కీలకమన్న కేజ్రీవాల్ వాటిని బహిరంగంగానే చర్చించడం మంచిదని పేర్కొన్నారు.