Rakesh tikait | భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేశ్ టికాయత్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ రాబోయే రోజుల్లో రాష్ట్రపతి అవుతారని, ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రానున్న రోజుల్లో దేశ ప్రధాని అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో టికాయత్ పై వ్యాఖ్యలు చేశారు. మరో మారు సీఎంగా యోగి బాధ్యతలు చేపడతారా? అని ఆ ఇంటర్వ్యూలో టికాయత్ను ప్రశ్నించగా…
‘అరే… యోగి ప్రధాని కావాలి. అప్పుడు ప్రధాని మోదీ మధ్యలోనే వెళ్లిపోతారు. ఆయన్ను రాష్ట్రపతి చేయాలి. అప్పుడు యోగి ప్రధాని అవుతారు. యూపీ సీఎం పోస్ట్ ఖాళీగా ఉంటుంది. ఇతరులను చూసుకోవాలి మనం.’ అని టికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి పదవిలో రాంనాథ్ కోవింద్ ఉన్నారుగా అని ప్రశ్నించగా… ఇంకా ఎన్ని రోజులుంటారు? అంటూ టికాయత్ ఎదురు ప్రశ్నించారు.
రాబోయే యూపీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయరని, యోగి ప్రధాని అవుతారని, మోదీ రాష్ట్రపతి అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రజలు వేసే ఓట్లతో గెలవలేదని, లేనిపోని జంఝాటాలతోనే గెలవాలని చూస్తుందని చురకలంటించారు. ప్రత్యర్థి పార్టీలందరూ అత్యంత జాగరూకతతో ఉండాలని టికాయత్ పిలుపునిచ్చారు. బీజేపీ నేతలకు ఏమాత్రం నిజాయితీ లేదని, ప్రత్యర్థులందరూ జాగరూకతతో ఉండాలని కోరారు. ఒక్కొక్కరు ముగ్గురేసి చొప్పున న్యాయవాదులను కూడా సిద్ధం చేసుకోవాలని తాము సూచిస్తున్నామని, ఎన్నికలకు సంబంధించిన పత్రాలను నింపే సమయంలో బీజేపీ వాళ్లు లేనిపోని గందరగోళాన్ని సృష్టించి, ప్రత్యర్థులను గందరగోళంలోకి నెట్టేస్తారని, రిగ్గింగ్ కూడా చేస్తారంటూ టికాయత్ విరుచుకుపడ్డారు.