PM Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): అవినీతి కేసులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకొన్న డబ్బును తిరిగి పేదలకే పంచే యోచన చేస్తున్నట్టు ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు పశ్చిమబెంగాల్లో కృష్ణానగర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నిలబడిన ‘రాజమాత’ అమృతా రాయ్తో ఆయన ఇటీవల ఫోన్లో మాట్లాడారు. తొలుత బెంగాల్లో ఈడీ స్వాధీనం చేసుకొన్న రూ. 3 వేల కోట్లను పేద ప్రజలకు ఎలా పంచాలన్న అంశంపై న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్టు ఆ ఫోన్లో ప్రధాని చెప్పుకొచ్చారు. ఈ ఆడియోను బీజేపీ పరీవారం విడుదల చేసింది. ఈసారి ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే, ఈడీ కస్టడీలోని డబ్బును పేదలకు పంచే మార్గాలను చూస్తామని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
ఈడీ కస్టడీలో రూ.1.32 లక్షల కోట్లు
మనీలాండరింగ్కు సంబంధించి రాజకీయ నాయకులు, వ్యాపారులు, అధికారుల ఇండ్లు, కార్యాలయాలపై 2014 జనవరి 1 నుంచి అక్టోబర్ 31, 2023 మధ్య ఈడీ నాలుగు వేలకు పైగా దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ. 1.32 లక్షల కోట్ల విలువైన సొత్తును సీజ్ చేసింది. ఈ మేరకు గత డిసెంబర్లో ఓ ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. ఈ స్థాయిలో సొమ్మును సీజ్ చేయడం చరిత్రలో మొదటిసారి.
చట్టం ఏం చెప్తున్నది?
ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న రూ. 1.32 లక్షల కోట్ల సొమ్ముంతా ఎక్కడ ఉందన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతున్నది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని సెక్షన్ 9 ప్రకారం.. సీజ్ చేసిన సొమ్మునంతా కేసు తేలేవరకూ ఈడీ వ్యక్తిగత పద్దుల ఖాతా ఉన్న ఆర్బీఐ లేదా ఎస్బీఐ బ్రాంచీలో జమ చేయాలి. నిందితుడి నేరం రుజువుకాకపోతే, తిరిగి ఆ సొత్తును సదరు వ్యక్తికి అప్పజెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ నిందితుడి నేరం రుజువైతే, ‘లెక్కలోకి రాని ధనం’ కేంద్రప్రభుత్వ ఖజానాలోకి వెళ్తుంది. ఈ డబ్బును జాతి సంపదగా పరిగణిస్తారు. ఈ సొత్తును ఏ పార్టీ కూడా తమ రాజకీయ ప్రయోజనాలకు ఖర్చు చేయడానికి వీలులేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
అప్పుడు కూడా నల్లధనంపై ఇలాగే..
బీజేపీని గెలిపిస్తే, విదేశాలకు తరలిపోయిన నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ఒక్కో భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షల చొప్పున జమ చేస్తానంటూ 2014 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ హామీనిచ్చారు. పదేండ్లు గడిచింది. నల్లధనం తీసుకొస్తానన్న హామీని ఆయన ఎప్పుడో మరిచిపోయారు. ఇదే విషయమై 2015లో హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నిస్తే, ‘ఎన్నికల ప్రచారంలో అదో గిమ్మిక్’ అంటూ ఆయన తేలిగ్గా కొట్టిపారేశారు.