బెంగళూరు, జూలై 12: కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం విద్య కాషాయీకరణపై సరికొత్త కసరత్తు ప్రారంభించింది. విద్యార్థులకు జ్ఞానాన్ని తలకిందులుగా బోధించాలని సిద్ధాంతీకరిస్తున్నది. ఆధునిక శాస్త్రవిజ్ఞానాన్ని ‘ఫేక్న్యూస్’గా, మాంధాతల కాలంనాటి పాతచింతకాయ పచ్చడిని సిసలైన విజ్ఞానంగా వండివార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
జాతీయ విద్యావిధానంలో భాగంగా ఈ తరహా ప్రతిపాదనలను రూపొందించేందుకు ఓ కమిటీని కూడా వేసింది. పైథాగరస్ సిద్ధాంతం, న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం తప్పని పిల్లలకు ఎక్కించాలని చూస్తున్నది. మనుస్మృతి, ప్రాచీన సంఖ్యా పద్ధతిని, సంస్కృత భాషను వారి మీద బలవంతంగా రుద్దేందుకు సిలబస్ రూపొందిస్తున్నది.
ఈ దిశగా ‘భారతీయ విజ్ఞానంపై వైఖరి పత్రం’ రూపొందించింది. నాగరికతకు పుట్టిల్లయిన ఈ దేశానికి చెందిన స్మృతి సాహిత్యంపై సరైన అవగాహన లేక వెనుక తట్టు పట్టించారని, విదేశీ విజ్ఞానాన్ని గోరంతలు కొండతలు చేసి ఊరేగించారని ఆ పత్రంలో పేర్కొనడం విశేషం. మనుస్మృతి పేరెత్తగానే మన సమాజంలోని కొన్ని వర్గాలు అనవసరంగా ఆవేశపడి పోతాయని, నిజానికి అందులో ప్రజలకు, సమాజానికిమేలు చేసే ఉన్నతాదర్శాలు చాలానే ఉన్నాయనే వాదన అందులో వినిపించడం విశేషం.
పాఠ్యపుస్తకాల్లోని పాశ్చాత్య విజ్ఞానాన్ని తిరుగులేని సత్యంగా భావించరాదని, పైథాగరస్, హెరాన్ వంటి గ్రీకు గణిత సిద్ధాంత కర్తల బొమ్మలు కూడా పుస్తకాల్లో వేయరాదని ఆ పత్రం తీర్మానించింది. గత జనవరిలో కర్ణాటక రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ విభాగానికి సమర్పించిన ఆ పత్రం ప్రతి ఇటీవల వెలుగు చూసింది. రోహిత్-చక్రతీర్థ నేతృత్వంలోని పాఠ్యపుస్తకాల కమిటీ ప్రాథమిక, సెకండరీ విద్య తరగతి పుస్తకాల్లో చేసిన మార్పులపై దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో ఈ పత్రంలోని అంశాలు వెల్లడయ్యాయి.
పాఠ్యపుస్తకాల్లో చేర్చే భారతీయ రేఖాగణిత పద్ధతులను తరగతి గదిలోనే చెప్పాలని ఏమీ లేదని, క్రీడా మైదానంలో కూడా వాటిని బోధించవచ్చని పత్రం సూచించింది. ఈ సూచనలపై పలు వర్గాల నుంచి సహజంగానే వ్యతిరేకత ఎదురవుతున్నది. అయితే ఇవి కేవలం ప్రతిపాదనలు మాత్రమేనని, వీటిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది జాతీయ విద్యామండలి మాత్రమేనని కర్ణాటక అధికారులు అంటున్నారు.