అవతార్ సినిమాలోలాగే అండమాన్ నికోబార్ దీవుల్లో దురాక్రమణకు తెరలేచింది. పండోరా గ్రహంపై ఖనిజ నిక్షేపాలను చేజిక్కించుకోవాలనుకున్న మనుషులు ఆ గ్రహవాసులపై దాడులకు తెగబడటం సినిమాలో చూశాం. ఇప్పుడలాంటి పరిస్థితే నిజంగా చూడబోతున్నాం. అండమాన్, నికోబార్ దీవుల్లో 72 వేల కోట్లతో ఓ మెగా ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం తెగబడింది. ఈ ప్రాజెక్టుతో అక్కడి జీవవైవిధ్యం, ఆదిమ తెగల అస్థిత్వానికి ముప్పు ఏర్పడుతుందన్న పర్యావరణ ప్రేమికులు, మాజీ ఉన్నతాధికారుల విజ్ఞప్తులను మోదీ సర్కార్ ఖాతరు చేయడం లేదు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): అండమాన్, నికోబార్ దీవుల్లోని గ్రేట్ నికోబార్లో కేంద్ర ప్రభుత్వం ఓ మెగా ప్రాజెక్టును నిర్మించాలనుకొంటున్నది. దీని విలువ రూ.72 వేల కోట్లు. ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పవర్ ప్లాంట్, టౌన్షిప్ను వచ్చే 30 ఏండ్లలో నిర్మించాలని ప్రణాళిక. ఏ లక్ష్యంతో వీటిని అక్కడే నిర్మిస్తున్నదన్న విషయాన్ని ఇప్పటివరకూ స్పష్టంగా ప్రకటించలేదు. ఈ ప్రాజెక్టు తొలివిడుత బిడ్డింగ్ శనివారం ప్రారంభమైంది. పీపీపీ పద్ధతిలో మొదటి విడుతలో 41 వేల కోట్లతో కంటైనర్ ట్రాన్షిప్మెంట్ పోర్ట్ను నిర్మించనున్నారు.
ప్రాజెక్టుతో నష్టమేంటి?
అండమాన్, నికోబార్లో 836 దీవులు ఉన్నాయి. మొత్తం వైశాల్యం 8,249 చదరపు కిలోమీటర్లు. జనాభా 3.8 లక్షలు. వందల దీవులున్నా, కేవలం 38 దీవుల్లోనే ప్రజలు నివసిస్తున్నారు. కేంద్రం ప్రతిపాదించిన ప్రాజెక్టు గ్రేట్ నికోబార్ దీవిలో నిర్మించనున్నారు. దీని వైశాల్యం 921 చదరపు కిలోమీటర్లు. జనాభా 8,067. ఇక్కడే ఆధునికత, నాగరికత తెలియని, ప్రకృతి ఒడిలోనే మనుగడ సాగిస్తున్న షోంపేన్, నికోబరీస్ వంటి ఆదిమ తెగలు నివసిస్తున్నాయి. 130 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అడవిలో అంతరించిపోతున్న ఎన్నో జాతులకు చెందిన చెట్లు, మొక్కలు, జంతువులు ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే మెగా ప్రాజెక్టును నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాజెక్టును వెంటనే నిలిపేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు 87 మంది మాజీ టాప్ బ్యూరోక్రాట్లు గత ఆదివారం లేఖ రాశారు. లేఖపై సంతకం చేసిన వారిలో మాజీ ఎలక్షన్ కమిషనర్ ఖురేషీ, మాజీ ఛీఫ్ ఇన్వర్మేషన్ కమిషనర్ వాజాహత్ హబీబుల్లా, మాజీ ఐఏఎస్లు హర్ష మందేర్, జూలియో రిబేరియో, అరుణా రాయ్ ఉన్నారు.
అభ్యంతరాలు-అనుమానాలు
సహజసిద్ధంగా ఉన్న దీవుల్లోని అరుదైన వృక్షజాతులను పెకిలించడమెందుకు? వాటికి బదులుగా ఎక్కడో సుదూరంలోని హర్యానాలో ఎడారిగా మారిన ఆరావళి ప్రాంతంలో అదే స్థాయిలో చెట్లను నాటుతామని ప్రభుత్వం చెప్పడం నవ్వుతెప్పిస్తున్నది’
– రాష్ట్రపతికి రాసిన లేఖలో మాజీ బ్యూరోక్రాట్లు