పాట్నా, ఆగస్టు 24: విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో చిచ్చు పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. బీహార్లో మరింత దిగజారింది. ఇటీవలే మహారాష్ట్రలో అధికార శివసేనను నిట్టనిలువునా చీల్చి.. దొడ్డిదోవన అధికారం చేపట్టిన బీజేపీ.. బీహార్లోనూ అదే కుట్రకు పథక రచన చేసి.. బొక్కబోర్లా పడిన సంగతి తెలిసిందే. బీహార్ సీఎం నితీశ్కుమార్ ముందు జాగ్రత్తగా బీజేపీకి షాక్ ఇచ్చి.. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడంతో బీజేపీ రగిలిపోతున్నది. తమను కాదని విపక్ష పార్టీలతో జట్టుకట్టి ఏర్పాటు చేసిన సంకీర్ణ సర్కారును ఎలాగైనా కూలదోయాలని కుట్రకు తెరతీసింది. ఇందులో భాగంగా శాసనసభలో మహా ఘట్ బంధన్ సర్కారు విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్న వేళ.. సీబీఐని ఉసిగొల్పింది. ఆర్జేడీ నేతలను బెదిరింపులకు గురి చేసే పద్ధతుల్లో ఢిల్లీ, బీహార్లో ఆ పార్టీ నేతలకు చెందిన 27 ప్రాంతాల్లో బుధవారం ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహించింది.
బీహార్లో పాట్నా, మధుబని, కటిహార్తో సహా పలుచోట్ల ఆర్జేడీ రాజ్యసభ ఎంపీలు అష్ఫాక్ కరీం, ఫయ్యాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ సునీల్సింగ్, మాజీ ఎమ్మెల్సీ సుబోధ్ రాయ్ తదితరులకు చెందిన నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. గురుగ్రామ్లో బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్కు చెందినదిగా భావిస్తున్న ఓ మాల్ కూడా ఇందులో ఉండటం గమనార్హం. 200 ఆస్తిపత్రాలు, పెద్దఎత్తున నగదు స్వాధీనం చేసుకొన్నట్టు సోదాల అనంతరం సీబీఐ ప్రకటించింది. అయితే సీబీఐ అంటున్నట్టుగా ఆ మాల్ తనది కాదని, దాని యజమాని హర్యానాలో ఉన్నాడని, పైగా దానిని ఓ బీజేపీ ఎంపీ ప్రారంభించాడని తేజస్వి అసెంబ్లీలో దీటుగా సమాధానమిచ్చారు. ఢిల్లీలో కూర్చున్నవారికి బీహార్ స్ఫూర్తి అర్థం కాదని, బెదరగొడితే ఇక్కడ పనికాదని అన్నారు. బీజేపీ బ్యాచి పెండ్లికొడుకు లేని ‘బారాత్’లా ఉన్నదని ఎద్దేవా చేశారు. బీజేపీకి 2024 ఎన్నికల భయం పట్టుకున్నదని, అందుకే ముగ్గురు అల్లుళ్లతో (సీబీఐ, ఈడీ, ఐటీని ఉద్దేశిస్తూ..) విపక్షాలపై దాడి చేస్తున్నదని ఎద్దేవా చేశారు. బీజేపీ రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నాయని నితీశ్ మండిపడ్డారు.
కశ్మీర్ నుంచి తమిళనాడు వరకూ ఇదే వరుస
సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సంస్థలను బీజేపీ తమ చేతిలో కీలుబొమ్మల్లా ఆడిస్తున్నదని విపక్షాలు సహా ప్రముఖులు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చే కుట్రలో భాగంగా నేతలపైకి బీజేపీ వీటిని ఉసిగొల్పుతున్నది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి బీహార్, మహారాష్ట్ర, బెంగాల్.. ఇలా విపక్షాల నేతలపై సీబీఐ, ఈడీ దాడులు జరిగాయి. బీజేపీ పాలనలో ఉన్న రాష్ర్టాల్లో మాత్రం వీటి జాడ మచ్చుకైనా కనిపించదు.