సామాన్యుల తిండిపై కేంద్రం జీఎస్టీ బాదుడు
ధనికులు కొనే వజ్రాలపై 1.5 శాతమే పన్ను
సామాన్యుల ఉసురుతీస్తున్న మోదీ సర్కారు
జీఎస్టీ చట్టానికి వెయ్యికిపైగా సవరణలు
పన్నుల పెంపు విధ్వం సానికి దారితీస్తుంది.
– జాన్ మార్షల్, అమెరికా మాజీ చీఫ్ జస్టిస్
కోట్లమంది పేదల ఆహారమైన గోధుమ పిండి, పాలు, పాల ఉత్పత్తులపై 5% జీఎస్టీ! పైసలెక్కువై ఖర్చుపెట్టేందుకు ఆడే జూదాలైన కాసినోలు, గుర్రపు పందేలపై జీఎస్టీ రద్దుకు సిఫారసులు.. ఇదీ మోదీ సర్కారుకు పేదలపై ఉన్న ప్రేమకు నిదర్శనం.
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ఆదాయాన్ని పెంచి, తద్వారా వచ్చే పన్నులతో ఖజానా నింపుకోవడం ప్రజా ప్రభుత్వాల లక్షణం. అభివృద్ధిని గాలికి వదిలి, ప్రజలపై అడ్డగోలు పన్నులు వేసి ముక్కుపిండి వసూలు చేసేవి ప్రజాకంటక ప్రభుత్వాలు. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రెండో క్యాటగిరీకి చెందినదని గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) చట్టాన్ని చూస్తే అర్థమవుతున్నది. మోదీ ప్రభుత్వం 2017 జూలై 1న జీఎస్టీని అమల్లోకి తెచ్చింది. ఆ రోజు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలే చేసుకొన్నాయి. కానీ, అప్పటి నుంచే ప్రజలపై పన్నుబాదుడు మొదలైంది. ప్రజల జేబుకు చిల్లు పడుతుండగా, కేంద్రం ఖజానా గలగలలాడుతున్నది. ‘నిపుణులు తయారు చేసి ఇచ్చిన ముసాయిదా ప్రకారం జీఎస్టీ చట్టం లేదు. దీనివల్ల ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారులు భారీగా నష్టపోతారు’ అని జీఎస్టీని ప్రారంభించినప్పుడే మాజీ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పీ చిదంబరం హెచ్చరించారు.
అనేక మంది ఆర్థిక నిపుణులు సైతం ఇదే అభిప్రాయం చెప్పారు. ఇది అక్షరాలా సత్యమని ఇప్పుడు తేలుతున్నది. పెద్ద నోట్ల రద్దుతో మోదీ సర్కారు సామాన్యుడిని ఆర్థికంగా దెబ్బకొడితే, కరోనా విపత్తు పూర్తిగా దివాళా తీయించింది. దీంతో లక్షల వ్యాపారాలు మూతబడ్డాయి. కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. ఈ సమయంలో ప్రజలపై భారం తగ్గించాల్సిన ప్రభు త్వం.. కొత్త పన్నులు విధిస్తున్నది. ఇటీవల పాలు, పాల ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఈ నెల 27న మహా ధర్నా చేపట్టనున్నట్టు డెయిరీ ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
ప్రతి కుటుం నిత్యావసరాల్లో ఒకటైన పాలనూ మోదీ ప్రభుత్వం వదల్లేదు. పెరుగు, లస్సీ, బటర్మిల్క్ వంటి ప్రీ ప్యాక్డ్, ప్రీ లేబుల్డ్ (ప్యాక్ చేయకముందు ఎలాంటి బ్రాండింగ్ లేని) పాల ఉత్పత్తులపై ఇప్పటివరకు జీఎస్టీ లేదు. ఇకపై 5 శాతం పన్ను విధించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. డెయిరీ మిల్కింగ్ మిషనరీ (పాలు, పాల ఉత్పత్తుల తయారీలో వినియోగించే వివిధ రకాల యంత్రాలు)పై జీఎస్టీ 12% ఉండగా.. 18 శాతానికి పెంచింది. ఈ నిర్ణయంతో పాలు, పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ వంటి వాటి ప్రతి కుటుంబం కనీసం 10-15% అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే పశువుల మేత దగ్గరి నుంచి అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి. తాజా వడ్డింపుతో దేశవ్యాప్తంగా పాల వ్యాపారంపై ఆధారపడిన 9 కోట్ల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడనున్నది. దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పేదరిక నిర్మూలన వ్యవస్థ డెయిరీ సెక్టార్. వ్యవసాయ రంగ జీడీపీలో దాదాపు 25 శాతం డెయిరీ నుంచే వస్తున్నది. తాజాగా జీఎస్టీ విధించటంతో వినియోగదారులపై భారం పెరిగినా.. ఉత్పత్తిదారులకు రూపాయి కూడా లాభం రాదు. ఇది పేదల జేబులను కొట్టి ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే. మోదీ ప్రభుత్వ నిర్ణయంతో సహకార రంగంలో ఉన్న డెయిరీ సెక్టార్ పూర్తిగా దెబ్బతింటుందని, పెద్దపెద్ద సంస్థలు మాత్రమే నిలబడుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. పాలరంగం మొత్తం కార్పొరేట్ వశం అవుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మోదీ ప్రభుత్వం దవాఖానలను కూడా వదల్లేదు. ఇప్పటికే వైద్యరంగంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న అన్ని రకాల వస్తువులు, సేవలపై పన్నుల మోత మోగించింది. తాజాగా దవాఖాన గదులపైనా పన్నులేసింది. రోగుల గదుల రోజువారీ కిరాయి (ఐసీయూ మినహా) రూ.5 వేలు దాటితే 5 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. దీంతో వైద్యసేవల ఖర్చు మరింత పెరుగనున్నది. ‘రోజుకు రూ.5 వేలు కిరాయి చెల్లించినవారు రూ.250 జీఎస్టీ చెల్లించలేరా?’ అంటూ కేంద్రం ఎద్దేవా చేయడం కొసమెరుపు. దవాఖానల్లో ఉండే బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లపైనా జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచింది. వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించాల్సింది పోయి పన్నులు పెంచటంపై నిపుణులు మండిపడుతున్నారు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం
జీఎస్టీ ప్రారంభమైన నాటి నుంచి దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం లేదు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.95 శాతంగా ఉన్నది. 2017-18లో కాస్త అదుపులోకి వచ్చినట్టు కనిపించినా.. ఆ తర్వాత క్రమంగా పెరుగడం మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్లో అత్యధికంగా 7.79 శాతం నమోదైంది. ప్రస్తుతం దాదాపు 7 శాతంగా ఉన్నది. ద్రవ్యోల్బణం పెరిగిన కొద్దీ ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగిన కొద్దీ సామాన్యులు కొనలేని స్థితికి చేరుకుంటారు. జీవన ప్రమాణాలు పడిపోయి, మరింత పేదరికంలోకి జారిపోతుంటారని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అంటూ ఊదరగొట్టి జీఎస్టీని అమల్లోకి తెచ్చిన మోదీ ప్రభుత్వం.. తనకు అనుకూలంగా, ప్రజలపై ఆర్థిక భారం మోపేలా దాన్ని ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉన్నది. ఐదేండ్లలో (1826 రోజుల్లో) జీఎస్టీలో వెయ్యికిపైగా మార్పులు జరిగాయి. అంటే.. రెండు రోజులకు ఒకసారి చట్టాన్ని మోదీ ప్రభుత్వం మారుస్తూనే ఉన్నది.
రాష్ర్టాల హక్కులకు కత్తెర
జీఎస్టీ చట్టం సామాన్యుల నడ్డి విరువటమే కాకుండా రాష్ర్టాల హక్కులను కూడా హరిస్తున్నది. ఈ చట్టం వచ్చిన తర్వాత పన్నుల విషయంలో కేంద్రం ఎంత చెప్తే అంత అన్నట్టుగా తయారైంది. ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పుడు దీనివల్ల ఏర్పడే నష్టాలకు పరిహారం ఇస్తామని కేంద్రం రాష్ర్టాలకు హామీ ఇచ్చింది. ఆ పరిహారం కోసం తెలంగాణతోసహా అనేక రాష్ర్టాలు ఇప్పటికీ మోదీ సర్కారును అడుగుతూనే ఉన్నాయి. మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో దేశాన్ని మరిం త సహకార సమాఖ్యగా రూపొందిస్తామని గొప్పలు చెప్పారు. ఆచరణలో మాత్రం రాష్ర్టాల హక్కులను తగ్గిస్తూ దేశాన్ని ఏకకేంద్ర వ్యవస్థ గా మార్చేస్తున్నారని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేతన్నల ఉసురు పోసుకున్నడు
దేశంలో ఒకప్పుడు వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక శాతం మంది ఆధారపడిన పరిశ్రమ చేనేత. అందుకే చేనేతకు పన్ను మినహాయింపులు ఉండేవి. మోదీ ప్రభుత్వం ఈ సంప్రదాయానికి తిలోదకాలిచ్చింది. జీఎస్టీ అమలుతో 5 శాతం పన్ను భారం ప్రారంభమైంది. అసలే తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న చేనేత పరిశ్రమకు ఇది శరాఘాతంగా మారింది. కేంద్రం నిర్వాకంతో కుదేలైన నేతన్నను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు వివిధ రకాల పథకాలు ప్రవేశపెట్టింది. బతుకమ్మ చీరల రూపంలో చేతినిండా పని కల్పించింది. ఇలా ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న చేనేతపై మోదీ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణ సహా అనేక రాష్ర్టాలు ఎదురుతిరిగాయి. చేనేతలను ఆదుకొనేందుకు పన్ను ఎత్తేయాల్సింది పోయి పెంచడం ఏంటని కేంద్రాన్ని నిలదీశాయి. దీంతో ప్రస్తుతానికి పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసినా.. జీఎస్టీ కత్తి ఇంకా చేనేతపై వేలాడుతూనే ఉన్నది.
జీఎస్టీకి ముందు రూ.1.50 కోట్లకుపైగా వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలు మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాల్సి వచ్చేది. ఎంఎస్ఎంఈలు, చిరు వ్యాపారులకు పన్ను భారం నుంచి ఊరట లభించేది. జీఎస్టీ చట్టంలో కేంద్రం ఈ మొత్తాన్ని రూ.20 లక్షలకు కుదించింది. గత ఆర్థిక సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా ఆరు వేల ఎంఎస్ఎంఈలు మూతబడ్డాయి. వీటిల్లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. జీఎస్టీ వచ్చాక పన్నుల భారం మోయలేక సూరత్లో టెక్స్టైల్ రంగంలో చిన్న, మధ్య తరహా వ్యాపారులు అదృశ్యమయ్యారు. హౌరాలో ఫౌండ్రీ ఇండస్ట్రీలోనూ ఇదే పరిస్థితి.