(స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ) : ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఇండ్ల వద్ద జాతీయ పతాకాలు ఎగురవేయాలని ప్రధాని నరేంద్రమోదీ జాతి జనులకు పిలుపునిచ్చారు. జెండాతో దిగిన సెల్ఫీ ఫొటోలను ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ క్రమంలో కోట్లాది మంది భారతీయులు తమ సెల్ఫీ ఫొటోలను ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. లొకేషన్ను జియోట్యాగ్ చేస్తూ ఫోన్ నంబర్ తదితర వివరాలను సమర్పించారు. అయితే, ఇప్పుడు ఆ పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు నాన్-ప్రాఫిట్ జర్నలిజం ఆర్గనైజేషన్ ‘రెస్ట్ ఆఫ్ వరల్డ్’ సంచలన కథనాన్ని ప్రచురించింది.
ఎన్నికల కోసమేనా?!
తాము ఉంటున్న ప్రాంతాన్ని ట్యాగ్ చేయమంటూ ఇంత పెద్దయెత్తున ప్రచారం చేయడం ఇప్పటివరకూ ఏ దేశంలోనూ జరుగలేదు. పౌరుల పేర్లు, ఫొటోలు, లొకేషన్ను అడగడాన్ని చూస్తే.. ఇది భవిష్యత్తు ఎన్నికల ప్రచారం కోసమేనని అనిపిస్తున్నది. పౌరుల డాటా హ్యాకర్ల చేతిలోకి చేరితే ప్రమాదమే.
– శ్రీనివాస్ కొడాలి, ఫ్రీ సాఫ్ట్వేర్ మూమెంట్ ఆఫ్ ఇండియా కూటమిలో పరిశోధకుడు
డాటా ఎందుకు సేకరించారు?
‘హర్ ఘర్ తిరంగా’ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన డాటా ఎవరి ఆధీనంలో ఉన్నది? అసలు ఈ డాటాను ఎందుకు సేకరించారు. దీంతో ఏం చేయబోతున్నారు?
– ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్
మరింత సమాచారం కోసం..
యూజర్ ఏయే సైట్లు బ్రౌజ్ చేస్తున్నాడన్న వివరాలు తెలుకోవడానికి సాయపడే కుకీస్ను ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్సైట్కు వినియోగించారు. దీన్ని బట్టి చూస్తే.. పౌరులకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవాలన్న ఆత్రుత సైట్ నిర్వహకులకు ఉన్నదని స్పష్టమవుతున్నది.
– ఆయుష్మాన్ కౌల్, సైబర్ నిపుణుడు