Elara | పన్ను ఎగవేతకు స్వర్గధామంగా పిలిచే మారిషస్లో రిజిస్టరైన కంపెనీ అది. పేరు ఎలారా వెంచర్ క్యాపిటల్ ఫండ్ . ఈ కంపెనీలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎలారా సంస్థ నుంచే అదానీ గ్రూప్ కంపెనీలకు కుప్పలుతెప్పలుగా నిధుల వరద పారిందంటూ ‘హిండెన్బర్గ్’ ప్రధాన ఆరోపణ. ఇలాంటి ట్రాక్ రికార్డు కలిగిన ‘ఎలారా’ గుప్పిట్లో ఇప్పుడు దేశ భద్రత చిక్కుకుపోయింది. ఇంగ్లిష్ పత్రిక ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ ప్రచురించిన తాజా కథనాన్ని విశ్లేషిస్తే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏడీటీపీఎల్) సంస్థ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నది. భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే పెచోరా క్షిపణులు, రాడార్ సిస్టమ్లను ఆధునీకరించే రూ.590 కోట్ల విలువైన కాంట్రాక్టును 2020లో కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈ కంపెనీకి అప్పగించింది. దేశ భద్రతకు ఎంతో కీలకమైన క్షిపణులు, రాడార్ల తయారీని ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగించడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇస్రో, డీఆర్డీవోతో కలిసి ఏడీటీపీఎల్కు పనిచేసిన అనుభవం ఉన్నదని అధికారులు చెప్పుకొచ్చారు. అయితే, ఈ డీల్ వెనుక మరో కథ ఉన్నట్టు ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ ప్రచురించిన తాజా కథనాన్ని విశ్లేషిస్తే అర్థమవుతున్నది.
ఏడీటీపీఎల్కు క్షిపణుల కాంట్రాక్టు దక్కకముందే, అదానీ గ్రూప్నకు చెందిన అదానీ డిఫెన్స్, ఎలారా కంపెనీలు ఏడీటీపీఎల్లో వాటాలను కొనుగోలు చేశాయి. ఎప్పుడైతే, ఒప్పందం కుదిరిందో ఏడీటీపీఎల్లో ఎలారా కంపెనీ తన అనుబంధ కంపెనీ ద్వారా వాటాను పెంచుకొన్నది. ఇలా.. ఏడీటీపీఎల్లో మొత్తంగా అదానీ, ఎలారా కంపెనీలు కలిసి 51.65 శాతం వాటాను చేజిక్కించుకొన్నాయి. దీంతో ఏడీటీపీఎల్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అదానీ గ్రూప్, ఎలారా మేనేజ్మెంట్ ఆమోదముద్ర ఉండాల్సిందే. అంటే, ఒక రకంగా దేశ భద్రతకు కీలకమైన క్షిపణులు, రాడార్ల వ్యవస్థ తయారీ కాంట్రాక్టు అదానీ, ఎలారా కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో దేశ భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఓ విదేశీ కంపెనీ తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఎలారా కంపెనీకి, అదానీ గ్రూప్ కంపెనీలకు మధ్య ఏండ్ల నుంచి లావాదేవీలు జరుగుతున్నాయి. అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎలారా సంస్థ రూ. 9 వేల కోట్ల విలువైన పెట్టుబడులను పెట్టింది. ఈ అన్ని విషయాలను లోతుగా పరిశీలిస్తే, అదానీ గ్రూప్కు ఆర్థిక సాయాన్ని అందించిన ఎలారాకు లబ్ధి చేకూర్చేందుకు.. ఈ క్షిపణుల కాంట్రాక్ట్ కట్టబెట్టినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏడీటీపీఎల్కు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రక్షణ కాంట్రాక్ట్ కట్టబెట్టిందా అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
ఎలారా వెంచర్ క్యాపిటల్ ఫండ్. మారిషస్లో రిజిస్టరైంది. ఎలారా ఇండియా అపార్చునిటీస్ ఫండ్ పేరుతో అదానీ గ్రూప్నకు చెందిన మూడు కంపెనీల్లో రూ. 9 వేల కోట్లను పెట్టుబడులుగా పెట్టింది. అయితే, ఎలారా ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నదని, ఈ విదేశీ కంపెనీ కార్యకలాపాలపై అనుమానాలు ఉన్నాయని, ఈ కంపెనీ అదానీ గ్రూప్తో అక్రమ లావాదేవీలు జరిపిందని జనవరిలో హిండెన్బర్గ్ నివేదికలో ఆరోపించింది.