హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై పదేపదే అడ్డగోలు విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలకు పెద్ద షాకింగ్ న్యూస్. ఆర్థిక క్రమశిక్షణ పేరుతో రుణాల సేకరణలో రాష్ర్టాలకు నానా రకాల పరిమితులు విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. గత ఏడేండ్లలో విదేశాల నుంచి రూ.2.75 లక్షల కోట్లకుపైగా రుణాలు సేకరించింది. సమాచార హక్కు చట్టం ద్వారా సీనియర్ జర్నలిస్ట్ ఇనుగంటి రవికుమార్కు లభించిన సమాచారం ఇది. కేంద్ర ఆర్థికశాఖ పరిధిలోని విదేశీ రుణాల విభాగం నుంచి పొందిన ఈ సమాచారం ప్రకారం.. 2015 జనవరి నుంచి 2021 సెప్టెంబర్ 14 వరకు కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి రూ.2,75, 864 కోట్ల రుణాలు స్వీకరించింది. దీంతో మన దేశం విదేశాలకు బకాయి పడిన మొత్తం అప్పు దాదాపు రూ.7.09 లక్షల కోట్లకు పెరిగింది. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి 2014 వరకు (67 సంవత్సరాల్లో) మన దేశం ఏటా విదేశాల నుంచి సగటున రూ.6,367 కోట్ల అప్పు తీసుకున్నది. కానీ గత ఏడేండ్లలో ఈ సగటు ఏకంగా 63.6% పెరిగి రూ.39,435 కోట్లకు ఎగబాకింది. 2014 సంవత్సరం చివరి నాటికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మొత్తం (మల్టీలేటరల్ మరియు బైలేటరల్) రుణాలు రూ.3.76 లక్షల కోట్లుకాగా.. అవి నేడు రూ.6.24 లక్షల కోట్లు. మరోవైపు ఈ ఏడేండ్లలో ప్రభుత్వేతర రుణాలు రూ.56 వేలకోట్ల నుంచి రూ.83 వేలకోట్లకు పెరిగాయి. దీంతో మన దేశ మొత్తం విదేశీ అప్పులు రూ.7,08,815 కోట్లకు పెరిగాయి. దీన్ని దేశంలో ఉన్న 139 కోట్ల జనాభాతో లెక్కిస్తే ప్రతి పౌరునిపై రూ.5.09 లక్షల రుణ భారం ఉన్నట్టేనని ఇనుగంటి రవికుమార్ విశ్లేషించారు. రాష్ట్ర ప్రభుత్వం తెగ అప్పులు చేస్తున్నదని ఆడిపోసుకొంటున్న బీజేపీ నేతలు మోదీ సర్కార్ నిర్వాకంపై ఏమంటారో వేచిచూడాల్సిందే.