న్యూఢిల్లీ, జూన్ 30: కీలక విధాన నిర్ణయాలపై యూటర్న్లు తీసుకోవటంలో తనకు ఎవరూ సాటి లేరని మోదీ సర్కారు మరోసారి నిరూపించుకొన్నది. పేటెంట్ హక్కుల రద్దు అంశంపై డబ్ల్యూటీవోలో భారత ప్రభుత్వం ఉన్నట్టుండి తన వైఖరి మార్చుకొని ప్రపంచానికి షాకిచ్చింది. ఔషధాలు, ఇతర కీలక సాంకేతికతలపై పేటెంట్ల వల్ల పేద దేశాలు నష్టపోతున్నాయని పేటెంట్లను రద్దుచేయాలని భారత ప్రభుత్వం వాదిస్తున్నది. ధనిక దేశాలు పేటెంట్ హక్కులకు అనుకూలంగా ఉండగా, పేద దేశాల తరఫున భారత్ దశాబ్దాలుగా డబ్ల్యూటీవోలో పోరాటం చేస్తున్నది. అయితే, మంగళవారం ‘ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పై నిర్వహించిన డబ్ల్యూటీవో మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో భారత్ తన వైఖరిని మార్చుకొన్నది.
ఎందుకీ నిర్ణయం?
చాలాకాలంగా పేద దేశాలు పేటెంట్ హక్కులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఔషధాల అభివృద్ధిలో ధనిక దేశాల కంపెనీల పేటెంట్ హక్కుల వల్ల భారీగా లాభపడుతుంటే, పేద దేశాల్లో ప్రజలకు కనీస వైద్య సేవలు కూడా అందటం లేదని విమర్శిస్తున్నాయి. ఏ దేశంలో కొత్త ఔషధం ఆవిష్కరణ జరిగినా ప్రపంచం మొత్తం వినియోగించేలా వాణిజ్య విధానాలను మార్చాలని కోరుతున్నాయి.
డబ్ల్యూటీవోలో ఈ దేశాలకు భారత్ పెద్దన్నగా వ్యవహరిస్తున్నది. అందువల్లనే తుది డ్రాఫ్ట్ రూపకల్పనకు సంవత్సరాలపాటు చర్చలు జరపాల్సి వచ్చింది. ప్రస్తుతం భారత్ వైజ్ఞానికంగా వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో మన దేశం నుంచి కూడా కుప్పలు తెప్పలుగా పేటెంట్ దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి. కరోనా కాలంలో అమెరికా, యూరప్ దేశాలతో పోటీపడి భారత కంపెనీలు సొంత టీకాలను ఆవిష్కరించాయి. ఇప్పుడు భారత కంపెనీల వద్ద కోట్లకొద్ది కరోనా వ్యాక్సిన్ డోసుల స్టాక్ ఉన్నట్టు సమాచారం. ఈ దశలో పేటెంట్ హక్కులు లేకుంటే పేద దేశాల్లో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు మన కంపెనీలు స్వల్ప రాయల్టీపై టెక్నాలజీని బదిలీ చేయాలి. దీనిని భారత పారిశ్రామిక వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో మోదీ సర్కారు వెనుకడుగు వేసినట్టు సమాచారం.
భారత్ విశ్వసనీయతకు ముప్పు
డబ్ల్యూహెచ్వోలో ఉన్నట్టుండి వైఖరి మార్చుకోవటంతో ఇంతకాలం మనల్నే నమ్ముకొన్న పేద దేశాల్లో భారత ప్రతిష్ఠ దిగజారే ప్రమాదం ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయ సంబంధాల్లో నమ్మకం, విశ్వసనీయతే కీలకమని గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా చైనా, అమెరికాతో పోటీపడి ప్రపంచం ఆర్థిక శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న దేశానికి ఇలాంటి నిర్ణయాలు శరాఘాతం వంటివని పేర్కొంటున్నారు. మిత్ర దేశాలతో వ్యాపార, వాణిజ్య సంబంధాల్లో కూడా అపనమ్మకం ఏర్పడుతుందని, ఇది దేశానికి రాజకీయంగానే కాక ఆర్థికంగా కూడా దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.