Gold For Kasi Viswanath | ప్రధాని నరేంద్రమోదీకి అతడు అత్యంత అభిమాని. ఆ అభిమానం అవధులు దాటింది. కానీ, పేరు బయట పెట్టడానికి ఇష్ట పడటం లేదు. దక్షిణ భారత ప్రాంత వాసి అయిన ఆ అభిమాని.. ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ బరువు మేరకు కాశీ విశ్వనాథ ఆలయానికి 61 కిలోల బంగారాన్ని డొనేట్ చేశాడు. ఇప్పటికే 37 కిలోల బంగారం ప్లేట్లు కాశీ విశ్వనాథ ఆలయ గోడలు, సీలింగ్ తాపడం చేయడానికి ఉపయోగించారు. తొలిదశలో
చేసిన విరాళం కింద బంగారాన్ని తాపడం చేయడానికి 45 రోజులు పట్టింది. ఆదివారం ఈ పని పూర్తయింది. ఆదివారం ప్రధాని మోదీ వారణాసిలో ఎన్నికల బహిరంగసభలో పాల్గొని.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ పూజలు పూర్తయిన తర్వాత పూజారులు, దేవస్థానం అధికారులు.. సదరు మోదీ అభిమాని డొనేషన్ వివరాలను ప్రధానికి వివరించారని సమాచారం.
మరో 24 కిలోల బంగారాన్ని ఆలయంలోని స్తంభాలు, గర్భగుడికి తాపడం చేయడానికి వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియ మంగళవారం పూర్తయింది. ఈ వ్యవహారంపై ఆలయ అధికార వర్గాలు మౌనం వహిస్తున్నాయి. కాశీ విశ్వనాథ ఆలయ గర్బగుడి తాపడానికి 187 ఏండ్ల తర్వాత బంగారం డొనేట్ చేశారని చెబుతున్నారు.