దేశ ఆర్థికాభివృద్ధి, భద్రత విషయంలో ప్రధాని విఫలం
బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: సొంత పార్టీపై తరచూ విమర్శలు గుప్పించే బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రధాని నరేంద్ర మోదీపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో తీసుకెళ్లడంలో ప్రధాని విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. ‘గడిచిన 8 ఏండ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ, ఆర్థిక వృద్ధిరేటు లక్ష్యాలను సాధించడంలో మోదీ విఫలమయ్యారు. 2016 నుంచి వృద్ధి రేటు క్షీణిస్తున్నది.
అలాగే దేశ భద్రత చాలా బలహీనపడింది. చైనాతో వివాదం గురించి ప్రజలకు ఏ వివరణ ఇవ్వాలన్న విషయం ప్రధానికి కూడా అర్థంకావట్లేదు. వీటి నుంచి బయటపడొచ్చు. అయితే, ఎలా బయటపడొచ్చో ప్రధానికి తెలుసో.. లేదో?’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్పై స్పందించిన ఓ నెటిజెన్.. ప్రధానికి మీరు ఎందుకు సలహానివ్వడం లేదు? అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన స్వామి.. ‘వినడానికి సిద్ధంగా ఉన్నవాళ్లకే సలహాలు ఇవ్వగలమని పురాణ కాలంలో రుషులు చెప్పేవారు’ అని బదులిచ్చారు.