ప్రధాని మోదీ, హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వందలాది మంది అంగన్వాడీలు రోడ్డెక్కారు. గురుగ్రామ్లోని మినీ సచివాలయం ఎదుట ధర్నాకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని గతేడాది డిసెంబర్ 8 నుంచే నిరసనలు చేస్తున్నారు. తమ గౌరవ వేతనం పెంచుతామని ప్రధాని మోదీ 2018 సెప్టెంబర్లో హామీ ఇచ్చారని వారు చెబుతున్నారు. అంగన్వాడీ యూనియన్లతో డిసెంబర్ 29న ఖట్టర్ వర్చువల్గా సమావేశమై.. గౌరవ వేతనం పెంచడమే కాకుండా రెండేండ్ల (2019-20, 2020-21) బకాయిలతో పాటు, కరోనా సమయంలో సేవలందించినందుకు గాను రూ.1,000 పారితోషికం అందజేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు వాటిని నెరవేర్చలేదని మండిపడ్డారు. డిమాండ్లు సాధించుకునే వరకు తమ నిరసనలు ఆగవని స్పష్టంచేశారు.