పుణె, ఏప్రిల్ 9: దేశంలో విద్వేషం, హింసాత్మక ఆలోచనలపై అత్యవసరంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ పేర్కొన్నారు. పుణెలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో కొందరు మనస్సుల్లో ఒకటి పెట్టుకొని బయటకు మరొకటి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
నవ భారతదేశం తయారవుతున్నదని, కానీ రాజకీయాలను విద్వేషం నడిపించడమే ఆందోళనకరమని అన్నారు. జాతిపిత గాంధీ కాదు గాడ్సేనే అనే దిశగా నవ భారత్ నడుస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ద్వేషించేవారు భారత్ వదలండి’ అనే నినాదంతో విద్వేషాన్ని అంతం చేయాలని, లేకపోతే ప్రజలను అది బానిసలను చేస్తుందని పేర్కొన్నారు. మహాత్ముడి గురించి అపోహలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన వాపోయారు.