అహ్మదాబాద్: గుజరాత్ యూనివర్సిటీ క్యాంపస్లో కొంత మంది మూక దాడికి పాల్పడ్డారు. (mob attack at Gujarat University) ఈ సంఘటనలో ఐదుగురు విదేశీ విద్యార్థులు గాయపడ్డారు. అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీలో సుమారు 300 మంది విదేశీ విద్యార్థులు చదువుతున్నారు. 75 మంది విదేశీ విద్యార్థులు ఏ బ్లాక్ హాస్టల్లో ఉంటున్నారు. రంజాన్ మాసం నేపథ్యంలో శనివారం రాత్రి ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంకకు చెందిన విద్యార్థులు తమ రూమ్స్లో నమాజ్ చేశారు.
కాగా, సుమారు 25 మంది వ్యక్తులు ఆ బ్లాక్ వద్దకు చేరుకున్నారు. హాస్టల్ రూమ్లో నమాజ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘జైశ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. ఆ హాస్టల్పై రాళ్లు రువ్వారు. అక్కడున్న బైక్లను ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో ఐదుగురు విదేశీ విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు అక్కడకు చేరుకోవడంతో ఆ వ్యక్తులు పారిపోయారు.
మరోవైపు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. విదేశీ విద్యార్థుల హాస్టల్పై దాడి చేసి వారిని గాయపర్చిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ సంఘటన నేపథ్యంలో సీనియర్ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులతో గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి అత్యవసరంగా సమావేశమయ్యారు.