తన అయోధ్య పర్యటనను రద్దు చేసుకోవడంపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే స్పందించారు. తన అయోధ్య పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించానని, ఉద్దేశపూర్వకంగానే ఇలా ట్వీట్ చేశానని చెప్పుకొచ్చారు. తన అయోధ్య పర్యటనను వ్యతిరేకించే వారు నానా రకాలుగా మాట్లాడుతూ…. తనను ట్రాప్లో పడేయాలని చూశారని విమర్శించారు. కానీ వాళ్ల ట్రాప్లో తాను పడదల్చుకోలేదని, ఆ వ్యవహారాన్ని వివాదాస్పదం చేయవద్దని అనుకున్నానని రాజ్ థాకరే వెల్లడించారు.
నవనీత్ రాణా దంపతుల హనుమాన్ చాలీసా వివాదంపై రాజ్ థాకరే తీవ్రంగా స్పందించారు. హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్ల ద్వారా ప్లే చేయమని తాను కార్యకర్తలను ఆదేశించానని అన్నారు. కానీ.. రాణా దంపతులు మాతోశ్రీ ముందు పారాయణ చేస్తామని అన్నారు. మాతోశ్రీ ఏమైనా మసీదా? అంటూ రాజ్ థాకరే సూటిగా ప్రశ్నించారు. అలాగే ఉమ్మడి పౌరస్మృతిని దేశంలో తొందరగా అమలు చేయాలని, అలాగే జనాభానియంత్రణ చట్టాన్ని కూడా తీసుకురావాలని రాజ్ థాకరే డిమాండ్ చేశారు.