ఢిల్లీ, ఏప్రిల్ 15: ఢిల్లీ మద్యం విధానం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ ఈ నెల 23 వరకు ఉండటంతో సీబీఐ కేసులోనూ అదే తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్టు జడ్జి కావేరీ బవేజా పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు. సీబీఐ కస్టడీకి ఇచ్చిన గడువు ముగియడంతో సీబీఐ అధికారులు ఆమెను సోమవారం కోర్టులో హాజరుపర్చారు.
ఈ సందర్భంగా సీబీఐ తరఫున సీనియర్ అడ్వకేట్ పంకజ్కుమార్ వాదనలు వినిపిస్తూ.. విచారణకు కవిత సహకరించలేదని చెప్పారు. కేసు వివరాలతో 11 పేజీల రిమాండ్ కాపీని అందజేశారు. శరత్చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ.14 కోట్ల గురించి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, శరత్చంద్రారెడ్డి, బుచ్చిబాబు, విజయ్ నాయర్ సహా నిందితులతో జరిగిన సమావేశాల గురించి కవితను విచారణ చేసినట్టు తెలిపారు. కవిత సరైన సమాధానాలు ఇవ్వలేదని చెప్పారు. ఆమెకు 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించాలని కోరగా కోర్టు 9 రోజులే విధించింది. దీంతో ఆమెను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు.
కోర్టు నుంచి వస్తున్న సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల మాట్లాడుతూ.. ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని అభివర్ణించారు. కోర్టు బయట బీజేపీ నేతలు చేసిన ఆరోపణలనే విచారణలో సీబీఐ అధికారులు ప్రశ్నించారని చెప్పారు. గత రెండేండ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని, కొత్తదేమీ ప్రశ్నించడం లేదని అన్నారు. కోర్టుకు హాజరయ్యే సమయంలో కవిత ఉత్సాహంగా, ధైర్యంగా ఉన్నారు.
జై తెలంగాణ నినాదాలు చేశారు. ఆమె చేతిలో జపమాల కనిపించింది. కోర్టు ఆవరణలో కవిత మాట్లాడటంపై జడ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు బయట మాట్లాడుకోవచ్చునని అన్నారు. మీడియా అడిగితేనే కవిత మాట్లాడారని ఆమె లాయర్ మోహిత్రావు చెప్పారు. దీనిపై జడ్జి స్పందిస్తూ, ఏం చెప్పదల్చుకున్నా విచారణ సమయంలో సీబీఐకి చెప్పాలని అన్నారు.