ఢిల్లీ, మార్చి 23: తనపై మోపిన అభియోగాలన్నీ నిరాధారమైనవని, తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఈడీ కస్టడీలో ఉన్న కవిత శనివారం రౌస్ ఎవెన్యూ కోర్టుకు వెళ్తున్న సందర్భంగా అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఢిల్లీ ప్రభుత్వ మద్య విధానం పేరుతో తనపై మోపిన కేసు కేవలం రాజకీయ ప్రేరేపితమైనదని చెప్పారు. కల్పిత, కట్టుకథలతో పెట్టిన అక్రమ కేసు అని విమర్శించారు. కస్టడీలో ఉన్న తనను ఈడీ అధికారులు ఇప్పటివరకు అడిగిం దే అడుగుతున్నారని, విచారణలో కొత్తగా ఏమీ లేదని తెలిపారు.
ఈడీ పెట్టిన అక్రమ కేసుపై న్యా యపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. దేశంలో ఒకపక్క ఎన్నికలు జరుగుతుంటే మరోపక్క కేంద్ర ఆధీనంలోని ఈడీ ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ఎన్నికల సమయంలో ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ పార్టీలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న ఈ అరెస్టులపై ఎన్నికల సంఘం కూడా దృష్టిసారించాలని ఆమె విజ్ఙప్తిచేశారు. దేశ ప్రజలు ఈ అరెస్టులపై ఆలోచించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆమె పిలుపునిచ్చారు.
ఢిల్లీ మద్యం విధానం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది. ఈ నెల 16న వారం రోజులపాటు ఇచ్చిన కస్టడీ గడువు ముగియడంతో ఈడీ అధికారులు శనివారం ఆమెను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కవితను మరో ఐదురోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. మరో మూడు రోజుల కస్టడీకి మాత్రమే అంగీకరించిన కోర్టు ఈ నెల 26న ఉదయం 11 గంటలలోగా కవితను తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. కవితను విచారించే విషయంలో జాప్యం ఉండకూడదని, అంతా సీసీ కెమెరాల ముందు జరగాలని, ఆ సీసీ ఫుటేజీని భద్రపరచాలని పేర్కొ న్నది. ఆమెకు ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేయాలని తెలిపింది. ఆమెకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని, కోర్టు నిర్ణయించిన వేళల్లో కుటుంబ సభ్యులను, న్యాయవాదులను కలుసుకొనేందుకు అనుమతించాలని ఈడీని ఆదేశించింది.
కవిత దాఖలుచేసిన బెయిల్ పిటిషన్పై ఈ నెల 26న విచారణ జరుపుతామని కోర్టు ప్రకటించింది. కవిత ఆస్తులు, ఆదాయపు పన్ను వంటి పత్రాలు ఇవ్వాలని ఈడీ కోరుతున్నదని, ఆమె కస్టడీలో ఉండగా వాటిని ఎలా ఇవ్వగలరని న్యాయవాది నితేశ్రాణా ప్రశ్నించారు. ప త్రాలు కావాలని ఈడీ మౌఖికంగా కోరుతున్నదని తెలిపారు. కవితకు బెయిల్ మంజూరయ్యే వరకు ఆ పత్రాలు ఇవ్వడం సాధ్యం కాదని చె ప్పారు. కవిత విచారణ అయ్యిందని, కస్టడీని పొడిగించాల్సిన అవసరం లేదని చెప్పారు. దీని పై ఈడీ తరఫు న్యాయవాది జోసెబ్ హుస్సేన్ ప్రతివాదన చేస్తూ, కవిత నుంచి మరింత సమాచారాన్ని రాబట్టాల్సి వున్నదని, కస్టడీని ఐదు రో జులు పొడిగించాలని కోరారు. వాదనల అనంతరం సీబీఐ కోర్టు, ఐదు రోజుల కస్టడీకి నిరాకరిస్తూ.. ఈ నెల 26 వరకే కస్టడీని పొడిగించింది. ఈ నెల 16న జారీ చేసిన ఉత్తర్వుల్లోని షరతులన్నీ అ మల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
ఈడీ అధికారులు శనివారం మాదాపూర్లో ని కవిత ఆడపడుచు ఇంట్లో సోదాలు చేపట్టారు. ఉదయం 6 నుంచే ఏడుగురు ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఆ అపార్ట్మెంట్లోని మూడో ఫ్లోర్లో గతంలో కవిత కొంతకాలంపాటు కుటుంబంతో కలసి ఉన్నా రు. ఇటీవల ఆమె ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు.. వాటిలో లభించిన సమాచా రం మేరకు సోదాలు జరిపినట్టు తెలిసింది.
కవిత కస్టడీ కేసు విచారణ జరిపిన కోర్టు హాలు మీడియా ప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, కుటుంబసభ్యులతో కిటకిటలాడింది. కవిత భర్త అనిల్, కుమారులు ఆదిత్య, ఆర్య కూడా కోర్టుకు వచ్చారు. కోర్టు అనుమతితో కవిత వారందరినీ కలిసి పలకరించారు. కొందరు కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసిన కవిత అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఎంపీ మాలోతు కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, కొందరు కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకోవడంతో వారందరినీ దగ్గరకు తీసుకున్న కవిత ధైర్యం చెప్పారు. ఇంతమంది అభిమానులు ఉండగా తనకేమీ కాదంటూ అందరినీ పేరుపెట్టి పలకరించారు. ఇద్దరు కుమారులతో నవ్వుతూ మాట్లాడారు. కోర్టు ఇచ్చిన గడువు పూర్తవ్వడంతో అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కవితను కలిసినవారిలో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తదితరులున్నారు.