జైపూర్: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కర్ రాజకీయ నాయకులపై సెటైర్ వేశారు. పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజల అంచనాలు అన్న అంశంపై సోమవారం జైపూర్లో జరిగిన సెమీనార్లో మంత్రి పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. సంతోషకరంగా ఉండే రాజకీయవేత్తను చూడడం చాలా అరుదుగా జరుగుతుందన్నారు. అధికారం, పదవిపై అభద్రత వల్ల ఈ పరిస్థితి ఉంటుందన్నారు. మంత్రులు కాలేకపోయామని ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉంటారని, మంచి శాఖ దొరకలేదని మంత్రులు అసంతృప్తితో ఉంటారని, మంచి శాఖ దొరికిన వాళ్లు.. సీఎం కాలేకపోయామని విచారిస్తుంటారని, అయితే ఎన్నేళ్లు ఆఫీసులో ఉంటామో తెలియని భయంలోనూ సీఎంలు ఉంటారని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు. రాజస్థాన్కు చెందిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ తప్పుకున్న సందర్భంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధానత్య సంతరించుకున్నది. రాజస్థాన్ కాంగ్రెస్లోనూ ముసలం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సెటైర్ రచయిత శరద్ జోషి రాసిన వ్యాఖ్యలను మంత్రి గుర్తు చేస్తూ.. రాష్ట్రంలో వ్యర్థంగా ఉన్న నేతలను ఢిల్లీకి పంపిస్తారని, ఇక ఢిల్లీలో పనికిరానివాళ్లను గవర్నర్లు చేస్తారని, ఇక గవర్నర్లు కూడా కాలేనివారు అంబాసిడర్లు అవుతారని మంత్రి తెలిపారు. తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. ఎవరు కూడా అనాసక్తతతో లేరన్నారు. హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. భవిష్యత్తు గురించి ఆలోచించనివాళ్లు సంతోషంగా ఉంటారని తెలిపినట్లు గడ్కరీ వెల్లడించారు.
ఒకసారి తాను నాగపూర్లో ఓడిపోయినప్పుడు.. ఓ కాంగ్రెస్ నేత తనను ఆ పార్టీలో చేరాలని కోరారని, కానీ తాను బీజేపీని వీడలేదన్నారు. పార్టీ భావజాలం పట్ల నమ్మకంతో ఉండాలని, మంచి రాజకీయాలకు ఇదే పునాది అవుతుందని ఆయన అన్నారు.