తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిర్ణయాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. దివంగత ఎమ్మెల్యే కుమారుడికి ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది. ఎమ్మెల్యే ప్రభుత్వ ఉద్యోగి కాదు అని స్పష్టం చేసింది.
2016 ఎన్నికల్లో చెంగనూరు నియోజకవర్గం నుంచి కేరళ అసెంబ్లీకి కేకే రామచంద్రన్ నాయర్ ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాలతో 2018లో రామచంద్రన్ కన్నుమూశారు. దీంతో ఆయన కుమారుడు ఆర్ ప్రశాంత్కు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగం కల్పించారు. ఎమ్మెల్యే కుమారుడికి ఉద్యోగం ఇవ్వడంపై కేరళ సీఎం తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఇదే అంశంపై అశోక్ కుమార్ అనే న్యాయవాది కూడా కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు శుక్రవారం తుదితీర్పు వెల్లడించింది.
‘ఎమ్మెల్యే ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఐదేండ్ల పాలన కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి మాత్రమే’ అని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. ఎమ్మెల్యేల కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సరైంది కాదు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ పోస్టింగ్ను రద్దు చేసినట్లు కోర్టు స్పష్టం చేసింది.