గువాహటి, మే 27: అస్సాంలోని లఖీపూర్ ఎమ్మెల్యే(బీజేపీ) కౌశిక్ రాయ్ తమను వేధిస్తున్నాడని, బెదిరిస్తున్నాడని, విధి నిర్వహణలో అవమానిస్తున్నాడని, నోటికొచ్చినట్టు తిడుతున్నాడని కచార్ జిల్లాకు చెందిన 30 మంది సివిల్ సర్వీసుల అధికారులు సీఎం హిమంత బిశ్వ శర్మకు ఫిర్యాదు చేశారు. అధికారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆయన చర్యలు మొత్తం అస్సాం సివిల్ సర్వీసుల అధికారుల సమగ్రతనే ప్రశ్నించే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అస్సాంలో ఇటీవల వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయ చర్యలకు వెళ్లిన అధికారుల పట్ల కౌశిక్ రాయ్ వ్యవహరించిన తీరును లేఖలో పేర్కొన్నారు. అధికారులను కొట్టాలని ఆయన పిలుపునివ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. అంతే కాకుండా ఉద్యోగులను ‘బియ్యం దొంగలు’ అభివర్ణించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.