భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్ర శాసనసభ స్పీకర్గా బీజూ జనతా దళ్ ఎమ్మెల్యే బిక్రం కేశరి అరుఖా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిక్రం కేశరికి సీఎం నవీన్ పట్నాయక్, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. అనారోగ్య కారణాలతో ఎస్ఎన్ పాత్రో స్పీకర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పాత్రో స్థానంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బిక్రంను స్పీకర్గా నియమించారు. అరుఖా 1995 నుంచి భంజానగర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర శాసనసభలో బీజేడీ ఎమ్మెల్యేలు 114 మంది, బీజేపీ 22, కాంగ్రెస్ 9, సీపీఐ(ఎం) నుంచి ఒకరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ చీఫ్విప్ మోహన్ మజ్హి మాట్లాడుతూ.. బిక్రం తనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, సభ సజావుగా కొనసాగేలా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ప్రతిపక్షాలకు కూడా తగినంత సమయం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నరసింగ మిశ్రా కోరారు.
తనకు సభ్యులంతా సహకరించాలని స్పీకర్ అరుఖా కోరారు. సభను హుందాగా నడిపేందుకు తన శక్తిమేర కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనను స్పీకర్గా నియమించిన సీఎం నవీన్ పట్నాయక్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అరుఖా పేర్కొన్నారు.