Tamil Nadu | చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన మంత్రి వర్గం నుంచి ఆర్థిక మంత్రి పలనివేల్ తియగా రాజన్(పీటీఆర్) ను తప్పించనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఇటీవలే ఆయన స్టాలిన్ కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ పలు ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్పులు కూడా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే కేబినెట్లో స్వల్ప మార్పులు, చేర్పులు చేపట్టాలని స్టాలిన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కేబినెట్లోకి డీఎంకే ఎమ్మెల్యే టీఆర్బీ రాజాను తీసుకునే అవకాశం ఉంది. టీఆర్బీ రాజా మన్నార్గుడి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్బీ రాజా తండ్రి టీఆర్ బాలు కేంద్ర మంత్రిగా గతంలో పని చేశారు. శంకరన్కోవిల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రాజాను కూడా కేబినెట్లో తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో కేబినెట్లో మొత్తం 53 మంది మంత్రులు ఉన్నారు.
అయితే తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నమలై విడుదల చేసిన ఆడియో క్లిప్పులపై ఆర్థిక మంత్రి పలనివేల్ స్పందించారు. తాను స్టాలిన్ కుమారుడు ఉదయనిధి, ఆయన అల్లుడు వీ శబరీసేన్పై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. కావాలనే పనిగట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించుకుని, వాయిస్ చేంజ్ చేసి చీప్ పాలిటిక్స్కు పాల్పడుతుందని ఆర్థిక మంత్రి ధ్వజమెత్తారు.