Tamil Nadu | చెన్నై : తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ ఖండించారు. కొందరు పని కట్టుకుని సంచలనం సృష్టించాలనే ఉద్దేశంతో పుట్టించిన వదంతులు అవి అని స్టాలిన్ కొట్టిపారేశారు. తన ఆరోగ్యంపైనా కొంతమంది తప్పుడు సమాచారం చేస్తున్నట్లు చెప్పారు. తాను ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉన్నాను. విధులు నిర్వహిస్తున్నాను అని స్టాలిన్ పొంగల్ శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు.
జనవరి 21న సేలంలో ఉదయనిధి ఆధ్వర్యంలో నిర్వహించనున్న డీఎంకే యువజన విభాగం సమావేశాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఇలాంటి వదంతులు పుట్టిస్తున్నట్లు సీఎం తెలిపారు. తమిళనాడు వ్యాప్తంగా యువత సేలం సదస్సుకు సిద్ధమవుతున్న తరుణంలో తన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ వార్తలను ఉదయనిధి ఇప్పటికే తోసిపుచ్చారు. అదంతా తప్పుడు ప్రచారమేనని జాతీయ మీడియాకు చెప్పారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడేందుకు ఉద్దేశించిన యువజన విభాగం సదస్సు నుంచి అందరి దృష్టి మరల్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర హక్కులు, సమాఖ్యవాదాన్ని పరిరక్షించడమే ఈ సదస్సు ఉద్దేశమని, దీన్ని వ్యతిరేకించే వారు దుష్ర్పచారం చేస్తున్నారని ఉదయనిధి మండిపడ్డారు.