MK Stalin | కచ్చతీవు వివాదంపై ప్రధాని నరేంద్రమోదీ చేసిన ద్వంద్వ ప్రమాణాల వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల ముంగిట మత్స్యకారులపై బీజేపీకి అకస్మికంగా ఎందుకింత ప్రేమ కలిగిందని ప్రశ్నించారు. అధికార డీఎంకేపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను స్టాలిన్ తిప్పి కొట్టారు. పదేండ్లుగా కుంభకర్ణ నిద్రలో ఉండి ఒక్కసారిగా మత్స్యకారులపై ఎన్నికల ప్రేమ ప్రదర్శిస్తు్న్న వారిని రాష్ట్ర ప్రజలు మూడు ప్రశ్నలు అడగాలనుకుంటున్నారని పేర్కొన్నారు.
‘రాష్ట్ర ప్రభుత్వం పన్ను రూపంలో రూపాయి చెల్లిస్తుంటే.. అందులో కేంద్రం 29 పైసలే ఎందుకు తిరిగి చెల్లిస్తుంది. మొత్తం పన్ను చెల్లించొచ్చు కదా` అని స్టాలిన్ అడిగారు. గతేడాది చెన్నై, తూత్తూడి వరదల సమయంలో తమిళనాడుకు కేంద్రం ఒక్క రూపాయి కూడా వరద సాయం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తమిళనాడు అభివ్రుద్ధికి ఒక్క పథకమైనా అమలు చేశారా? అని స్టాలిన్ నిలదీశారు.
‘ఇతర అంశాలపై ప్రజలను మళ్లించడానికి ప్రయత్నించడానికి బదులు ఈ ప్రశ్నలకు స్పందించండి మోదీ’ అని తమిళంలో రాసిన హ్యాష్ ట్యాగ్ తో ప్రధాని మోదీని స్టాలిన్ కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు అధికార డీఎంకే ఎలాంటి చర్యలు చేపట్టలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. శ్రీలంకకు కచ్చతీవు ద్వీపాన్ని భారత్ అప్పగించే విషయంలో బయట పడుతున్న కొత్త వివరాలు.. డీఎంకే ద్వంద్వ ప్రమాణాలను బయటపెట్టాయన్నారు.