చెన్నై : తమిళనాడు ఎన్నికల్లో భాగంగా మేనిఫెస్టోను డీఎంకే పార్టీ విడుదల చేసింది. ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో శనివారం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికల వేళ భారీగా వరాలు ప్రకటించారు. మేనిఫెస్టోలో సుమారు 500కుపైగా హామీలు ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెట్రోల్ రూ.5, డీజిల్పై రూ.4 తగ్గించనున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని, పరిశ్రమలో తమిళులకే 75శాతం ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మహిళలకు ప్రసూతి సెలవులు 12 నెలలకు పెంచనున్నట్లు ప్రకటించారు. నీట్ పరీక్షల రద్దుకు శాసనసభ తొలి సమావేశంలో ఆర్డినెన్స్ తేస్తామన్నారు. కార్మికులకు పాత పింఛన్ అమలు చేస్తామని, వంట గ్యాస్ సిలిండర్పై రూ.100 రాయితీ ఇస్తామని, తమిళనాడు వ్యాప్తంగా కలైంజ్ఞర్ క్యాంటిన్లు ఏర్పాటు చేస్తామన్నారు.
విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి మేనిఫెస్టోలో ప్రధానం ఇస్తున్నట్లు తెలిపారు. అన్నాడీఎంకే మంత్రుల అవినీతిపై విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హిందూ ఆలయాల పునరుద్ధరణకు రూ.వెయ్యి కోట్లు, మసీదులు, చర్చీల పునరుద్ధరణకు రూ.200 కోట్లు కేటాయిస్తానని వెల్లడించారు. ఆస్తి పన్ను పెంచబోమని, ఆవిన్ పాల ధర లీటర్పై రూ.3 తగ్గిస్తామని, ‘తిరుక్కురళ్’ను జాతీయ గ్రంథంగా కేంద్రం ప్రకటించేందుకు కృషి చేస్తానని స్టాలిన్ హామీ ఇచ్చారు. అలాగే ప్రసిద్ధ దేవాలయాలకు తీర్థయాత్రలకు వెళ్లేందుకు లక్ష మందికి రూ.25వేలు ఆర్థిక సాయం, శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇచ్చేందుకు కృషి చేస్తానని ప్రకటించారు.