ఐజ్వాల్, డిసెంబర్ 4: ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో జోరం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) ఘన విజయం సాధించింది. అసెంబ్లీలోని మొత్తం 40 స్థానాలకు ఈ పార్టీ 27 స్థానాల్లో విజయఢంకా మోగించింది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీకి కేవలం 10 స్థానాలు ఇచ్చిన ప్రజలు.. ఈ సారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇక జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్లు రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ కేవలం ఒక్క సీటులోనే గెలుపొందింది. 2018 ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ.. ఈసారి ఒక్క స్థానానికే పరిమితం కావడం గమనార్హం.
సీఎం సహా మెజార్టీ మంత్రుల పరాజయం
ఎంఎన్ఎఫ్ చీఫ్, సీఎం జోరంతంగా, డిప్యూటీ సీఎం టాన్లుయాతో సహా క్యాబినెట్లోని 9 మంది మంత్రులు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఐజ్వాల్ ఈస్ట్-1 స్థానం నుంచి పోటీచేసిన జోరంతంగా జెడ్పీఎం అభ్యర్థి లల్తాన్సంగా చేతిలో 2,101 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జెడ్పీఎం నుంచి సీఎం అభ్యర్థిగా ఉన్న ఆ పార్టీ కీలక నేత లాల్దుహోమా సెర్చిప్ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. మిజోరంలో ఓట్లు తక్కువగా ఉండటంతో దాదాపు అన్ని స్థానాల్లో 2-5 రౌండ్లలో లెక్కింపును పూర్తిచేసిన అధికారులు, గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల ఫలితాల్లో సంపూర్ణ మెజార్టీ రావడంతో ప్రభుత్వం ఏర్పాటుకు జెడ్పీఎం సిద్ధమవుతున్నది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో మంగళవారం సమావేశం ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే సప్దాంగా వెల్లడించారు. ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఐపీఎస్ నుంచి సీఎం స్థాయికి..
మిజోరం ఎన్నికల్లో జెడ్పీఎంను విజయం దిశగా నడిపించిన ఆ పార్టీ సీఎం అభ్యర్థి 73 ఏండ్ల లాల్దుహోమా జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి. ఒకసారి ఎంపీ, మరోసారి ఎమ్మెల్యేగా పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు ఎదుర్కొన్నారు. 1977లో ఐపీఎస్గా ఎంపికైన లాల్దూహోమా.. 1982లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి సెక్యూరిటీ ఇన్చార్జిగా పనిచేశారు. అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. 1984లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1988లో కాంగ్రెస్ను వీడటంతో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద మొదటిసారిగా ఎంపీగా ఆయనపైనే అనర్హత వేటు పడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆయన జెడ్పీఎం పార్టీ కార్యాకలాపాల్లో పాల్గొంటున్నారంటూ ఎంఎన్ఎఫ్ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లాల్దుహోమాపై 2020లో స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత ఆయన సెర్చిప్ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో గెలిచారు. జోరం నేషనలిస్టు పార్టీని స్థాపించిన లాల్దుహోమా.. తర్వాత దాన్ని పలు ప్రాంతీయ పార్టీలు కూటమిగా ఉన్న జెడ్పీఎంలో చేర్చారు.