కోల్కతా: పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ అనుచరురాలు అర్పిత ముఖర్జీ ఇళ్లలో రూ.50 కోట్లకుపైగా డబ్బుల కట్టలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. విద్యా శాఖ మంత్రి అయిన ఆయనను టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో ఈడీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత మిథున్ చక్రవర్తి దీనిపై స్పందించారు. ఈ స్కామ్తో సంబంధం ఉన్నవారి పేర్లను బయటపెట్టాలని కోరారు. ఈడీ స్వాధీనం చేసుకున్న రూ.50 కోట్లకుపైగా నగదు పార్థా ఛటర్జీదేనని తాను నమ్మడం లేదన్నారు. ఎవరికో చెందిన డబ్బును తన కస్టడీలో ఆయన ఉంచారని అన్నారు. ఆ డబ్బుల అసలు యజమానుల పేర్లను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ‘జైలులో బాధ పడటం ఎందుకు? ఆ డబ్బు అసలు యజమానుల పేర్లు చెప్పు’ అని పార్థా ఛటర్జీకి సూచించారు.
కాగా, నటుడి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన బీజేపీ నేత మిథున్ చక్రవర్తి మీడియాతో బుధవారం మాట్లాడారు. బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీరు బ్రేకింగ్ న్యూస్ వినాలనుకుంటున్నారా? ఈ సమయంలో ఇక్కడ కూర్చొన్న మాతో 38 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. వారిలో 21 మంది ప్రత్యక్షంగా నాతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక మిగతాది మీ అంచనా కోసం మీకే వదిలేస్తున్నా’ అని అన్నారు. మరిన్ని వివరాలను మీడియా కోరగా ‘ట్రైలర్ను విడుదల చేయమని నన్ను అడగవద్దు. సంగీతాన్ని ఆస్వాదించండి’ అని వ్యాఖ్యానించారు.