న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో రైలు సర్వీస్ జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నది. పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పాయిగురి నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మధ్య మిటాలి ఎక్స్ప్రెస్ రైలు నడుస్తుంది. తూర్పు రైల్వే పీఆర్వో ఏకలవ్య చక్రవర్తి ఈ మేరకు శనివారం వెల్లడించారు. అలాగే కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లకు పైగా భారత్, బంగ్లాదేశ్ మధ్య నిలిచిపోయిన రైలు సేవలను ఆదివారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. మే 29న భారత్-బంగ్లాదేశ్ మైత్రీ ఎక్స్ప్రెస్ రైలు , మే 30న బంధన్ ఎక్స్ప్రెస్ రైలు తిరిగి ప్రారంభమవుతాయని వెల్లడించారు.
అలాగే ఇరు దేశాల మధ్య మూడో ఎక్స్ప్రెస్ రైలు జూన్ 1 నుంచి ప్రారంభమవుతుందని తూర్పు రైల్వే పీఆర్వో ఏకలవ్య చక్రవర్తి తెలిపారు. కొత్తగా ప్రవేశపెడుతున్న మిటాలి ఎక్స్ప్రెస్ రైలు పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పాయిగురి నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మధ్య నడుస్తుందని చెప్పారు. ఈ మూడు రైళ్లకు ఇప్పటికే టిక్కెట్లు కూడా బుక్ అయ్యాయని వెల్లడించారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య రైళ్ల సర్వీసుల పునరుద్ధరణపై ఇరు దేశాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.