న్యూఢిల్లీ: తప్పిపోయిన అరుణాచల్ బాలుడు కనిపించాడని చైనా ఆర్మీ తెలిపింది. ఆ బాలుడ్ని అప్పగించేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నట్లు భారత ఆర్మీకి సమాచారం ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లోని ఎగువ సియాంగ్ జిల్లా జిడో గ్రామానికి చెందిన 17 ఏండ్ల మిరాన్ టారోన్ బుధవారం కనిపించకుండాపోయాడు. అయితే ఆ బాలుడ్ని చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన జరిగినప్పుడు టారోన్ మరికొంత మందితో కలిసి రెండు దేశాల సరిహద్దు ప్రాంతంలో వేటకు వెళ్లాడని జిల్లా అధికారులు తెలిపారు. మిగతా వారు తప్పించుకోగా టారోన్ను పీఎల్ఏ నిర్బంధించిందని ఆరోపించారు.
మరోవైపు తప్పిపోయిన బాలుడి గురించి సమాచారం అందుకున్న భారత ఆర్మీ వెంటనే పీఎల్ఏని సంప్రదించింది. బాలుడి ఆచూకీని కనుగొనడంలో సహకరించాలని కోరింది. అయితే, ఆ బాలుడు తమ ఆధీనంలో లేడని, అతడి గురించి ఎలాంటి సమాచారం తమ వద్ద లేదని పీఎల్ఏ తొలుత బుకాయించింది. బాలుడు పీఎల్ఏ ఆధీనంలోనే ఉన్న సంగతి బయటపడటంతో అతడి ఆచూకీని కనుగొనట్లు భారత ఆర్మీకి ఆదివారం తెలిపింది.
ఈ నేపథ్యంలో భారత ఆర్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. “అరుణాచల్ ప్రదేశ్లో తప్పిపోయిన బాలుడిని కనుగొన్నామని చైనా సైన్యం మాకు తెలియజేసింది. అతడ్ని అప్పగించేందుకు తగిన ప్రక్రియను అనుసరిస్తోంది” అని తేజ్పూర్కు చెందిన డిఫెన్స్ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ హర్షవర్ధన్ పాండే ఆదివారం ప్రకటించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులతోపాటు అరుణాచల్ప్రదేశ్ అధికారులు ఊరట చెందారు.
The Chinese Army has communicated to us that they have found a missing boy from Arunachal Pradesh and the due procedure is being followed: PRO Defence, Tezpur Lt Col Harshvardhan Pandey
— ANI (@ANI) January 23, 2022