శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు చెందిన హురియత్ నాయకుడు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ మూడేళ్లుగా గృహ నిర్బంధంలో ఉన్నారు. గురువారం నాటికి ఆయనను నిర్బంధించి మూడేళ్లు పూర్తయ్యాయి. దీంతో మిర్వాయిజ్ను విడుదల చేయాలని జమ్ముకశ్మీర్లోని ప్రధాన పార్టీల నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 2019 ఆగస్ట్ 5న జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లఢక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జమ్ముకశ్మీర్కు చెందిన ప్రముఖ పార్టీల అధినేతలు, మాజీ సీఎంలైన మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లాతో పాటు ఇతర నేతలను ఒక రోజు ముందు గృహ నిర్బంధం చేశారు.
కాగా, సుమారు ఏడాది తర్వాత ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, అనంతరం మెహబూబా ముఫ్తీకి గృహ నిర్బంధం నుంచి విముక్తి లభించింది. అయితే హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్, శ్రీనగర్లోని చారిత్రాత్మక జామియా మసీదు ప్రధాన వ్యవహార కర్త అయిన మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ 2019 ఆగస్ట్ 4 నుంచి ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. గురువారంతో ఆయన నిర్బంధానికి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనను విడుదల చేయాలని జమ్ముకశ్మీర్ నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.