Uttar Pradesh | లక్నో, అక్టోబర్ 2: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకొన్నది. టీ స్టాల్ నుంచి డబ్బులు దొంగతనం చేశాడన్న ఆరోపణలపై ఓ 12 ఏండ్ల బాలుడిని కొందరు వ్యక్తులు చితకబాదారు. బట్టలూడదీసి, ఓ స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటన ఫిరోజాబాద్లో సోమవారం ఉదయం చోటుచేసుకొన్నది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఏడుస్తూ వదిలిపెట్టాలని వేడుకొన్నా నిందితులు వదల్లేదు. బాలుడికి చేయి, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు బాధిత బాలుడిని రక్షించి, వైద్య పరీక్షల అనంతరం ఇంటికి పంపించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. దాడి చేసిన వారిలో తండ్రి, కుమారుడు ఉన్నట్టు తెలుస్తున్నది.