న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనాతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. భారత్లో కొత్త వేరియంట్ రోజు రోజుకు వ్యాపిస్తున్నది. ఈ క్రమంలో ప్రజలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఫోర్త్ వేవ్ నడుస్తోందని, మొత్తం ఇన్ఫెక్షన్ రేటు 6.1శాతంగా ఉందని, ప్రస్తుతం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అలసత్వాన్ని సహించేది లేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ శుక్రవారం స్పష్టం చేశారు.
యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాలో కోవిడ్-19 కేసులు వారం వారం పెరుగుతున్నాయన్న ఆయన.. ఆసియాలో కేసుల తగ్గుతున్నాయన్నారు. ప్రపంచంలో కొవిడ్ కేసులు మళ్లీ గరిష్ఠ స్థాయికి (ఒకే రోజులు అత్యధిక కేసులు) చేరుకుంటున్నాయని, డిసెంబర్ 23న 9.64లక్షల కేసులు నమోదయ్యాయన్నారు. యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో కొవిడ్ 19 కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని, ఆసియాలో కేసులు ఇప్పటికీ తగ్గుతూనే ఉన్నాయని రాజేశ్ భూషన్ తెలిపారు. గత రెండు వారాల్లో భారత్లో ప్రతి రోజు కొత్త కేసులు 7వేలు ఉన్నాయని, ప్రస్తుతం కేసులు నిరంతరం తగ్గుతున్నాయన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ రేటు 6శాతానికిగా ఉండగా.. భారత్లో 5.3శాతంగా ఉందని పేర్కొన్నారు. గత రెండు వారాల్లో 0.6 శాతం ఉందని, దేశంలో ఇన్ఫెక్షన్ రేటు 5-10 శాతం ఉన్న 20 జిల్లాలు ఉన్నాయని, అయితే ఇన్ఫెక్షన్ రేటు 10 శాతానికిపైగా ఉన్న జిల్లాలు రెండు ఉన్నాయన్నారు. ఈ రెండు జిల్లాలు మిజోరంలో ఉన్నాయని, ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలో అత్యధికంగా యాక్టివ్ కేసులున్నాయని వివరించారు.