హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): సన్నరకం ధాన్యం రైతు ఇంట్లో సిరులు కురిపిస్తున్నది. వానకాలంలో పంట నష్టంతో దిగుబడి తక్కువగా ఉండటం, యాసంగిలో రైతులు అధికంగా దొడ్డురకాలనే సాగుచేయడంతో సన్నాలకు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో తేమశాతంతో సంబంధం లేకుండా సన్నాల కొనుగోలుకు మిల్లర్లు పోటీ పడుతున్నారు. మద్దతుధర కంటే ఎక్కువ చెల్లించైనా కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని వానకాలంతోపాటు, యాసంగిలోనూ సన్నాలనే సాగుచేయాలని ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ యాసంగిలో దొడ్డురకం ధాన్యం సాగుకే రైతులు మొగ్గుచూపారు. దీంతో సన్నాలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది.
మిర్యాలగూడలో ఇప్పటికే సుమారు 4 లక్షల క్వింటాళ్ల సన్నరకాలను మిల్లర్లు కొనుగోలుచేశారు. ఒక్క మిల్లరే 2 లక్షల టన్నులు కొనుగోలు చేశానని చెప్పడం సన్నాలకు ఉన్న డిమాండ్ను చెప్పకనే చెప్తున్నది. రాష్ట్రంలో సన్నాలకు కొరత ఉండటంతో మిల్లర్లు ఇతర రాష్ర్టాల నుంచి అధిక ధర వెచ్చించైనా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సన్నాలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో అధిక చెల్లించేందుకూ మిల్లర్లు వెనుకంజ వేయడం లేదు. మద్దతు ధర క్వింటాల్కు రూ.1,888 ఉండగా మిల్లర్లు రూ.2,300 వరకు చెల్లిస్తున్నారు. పచ్చి ధాన్యాన్ని కూడా ఎలాంటి షరతుల్లేకుండా కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా ధాన్యంలో తేమ 17% ఉంటేనే మద్దతు ధర చెల్లిస్తారు. కానీ, 24%-27% ఉన్నప్పటికీ అధిక ధర ఇచ్చి కొంటున్నారు. దీంతో సన్నాలు సాగుచేసిన రైతులు హార్వెస్టర్లతో కోసిన ధాన్యాన్ని ఆరబెట్టడం, తూర్పారపట్టడం వంటివి లేకుండానే నేరుగా మిల్లులకు తరలిస్తున్నారు.
డిమాండ్కు తగ్గ ఉత్పత్తి లేకనే
వానకాలంలో సన్నాలను సాగు చేసినా అకాల వర్షాలతో అంచనాకు తగ్గట్లుగా ధాన్యం దిగుబడి రాలేదు. యాసంగిలో ఆశించిన మేర సాగు చేయకపోవడంతో అనివార్యంగానే సన్నాలకు డిమాండ్ పెరిగింది. వానకాలంలో 53 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఇందులో 39.66 లక్షల ఎకరాల్లో సన్నాలు వేశారు. దీంతో 70 లక్షల టన్ను ల దాకా సన్నాల దిగుబడి వస్తుందని అంచనా. కానీ, అం దులో సగం కూడా రాలేదు. మన రాష్ట్రంలో యాసంగిలో సాధారణంగారైతులు దొడ్డు రకం సాగుకే మొగ్గు చూపుతారు. యాసంగిలో 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 1.17 కోట్ల టన్నుల దొడ్డురకం, 21 లక్షల ట న్నుల సన్నరకం ధాన్యం వస్తుందని అంచనా వేశారు.
సన్నాలు పండిస్తే లాభాలే..
రాష్ట్రంలో సన్నాలకు భారీ డిమాండ్ ఉన్నది. వానకాలంలో పంట దెబ్బతినడం, ఈసారి అనుకున్న స్థాయిలో సాగులేకపోవడంతో డిమాండ్ పెరిగింది. పచ్చిగున్నా సరే అధిక ధర ఇచ్చి రైతుల నుంచి సన్నాలను కొనుగోలు చేస్తున్నాం. ప్రస్తుతం సన్నాలు పండించిన రైతులకు మంచి లాభం ఉన్నది. భవిష్యత్లోనూ ఇది కొనసాగుతుంది.